
దుబాయ్: మరికొద్ది గంటల్లోనే ఇండియన్స్ ప్రేమించే లీగ్ ఐపీఎల్(2020) షురూ కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గత సీజన్ రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి, ఆ జట్టు అభిమానులకు శుభావార్త అందింది.
కరోనా బారిన పడిన ఆ జట్టు యువ బ్యాట్స్మన్ రుతురాజ్ గైక్వాడ్కు తాజాగా నిర్వహించిన కోవిడ్-19 టెస్టుల్లో నెగటివ్ అని తేలింది. నిబంధనల ప్రకారం అతడికి 24 గంటల్లోగా మరోసారి టెస్టు చేయనున్నారు. రెండోసారి కూడా నెగటివ్ అని తేలితే.. ఈ యువ క్రికెటర్ క్వారంటైన్ నుంచి బయటకొస్తాడు.
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రుతురాజ్ కొన్ని ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కరోనా నుంచి బయటపడిన తర్వాత ఆటగాళ్లు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో రెండు మ్యాచ్లు ముగిశాక అతడు జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
గత సీజన్లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జత కట్టిన రుతురాజ్.. ఇప్పటి వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేయలేదు. సురేశ్ రైనా ఆకస్మాత్తుగా ఈ సీజన్తో తప్పుకోవడంతో అతను ఆడే మూడో స్థానంలో రుతురాజ్ను ఆడించాలని టీమ్మేనేజ్మెంట్ భావించింది. కానీ అతను కరోనా బారిన పడి త్వరగా కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.
భారత్-ఏ, మహారాష్ట్ర జట్లకు రెగ్యులర్ ఓపెనర్గా బరిలో దిగే రుతురాజ్.. ఐపీఎల్లో అరంగేట్రం కోసం ఈ యువ బ్యాట్స్మెన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన కొత్తలో చెన్నై సూపర్ కింగ్స్కు చెందిన 13 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన సంగతి తెలిసిందే. దీంతో మరో వారంపాటు సీఎస్కే సభ్యులు ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చింది. పేసర్ దీపక్ చాహర్కు కూడా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అతడు చాలా రోజుల క్రితమే కోలుకున్నాడు. జట్టుతో ప్రాక్టీస్ చేసి ఫస్ట్ మ్యాచ్కు సిద్దమయ్యాడు.