
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్కు ముందు డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి షాక్ తగిలింది. ఏదైతే జరగకూడదని ఆ టీమ్ ఫ్యాన్స్ కోరుకున్నారో అదే జరిగింది. ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఈ ఐపీఎల్లో సగం మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇటీవల వెస్టిండీస్తో మూడో టీ20లో తొడ కండరాల గాయానికి గురైన చాహర్ కనీసం ఎనిమిది వారాలు ఆటకు దూరం కాకున్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వర్గాలు చెప్పాయి.
మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 సీజన్ ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీపక్ చాహర్ జాతీయ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఈ ఏడాది అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో దీపక్ చాహర్ది రెండో స్థానం. అతడి కోసం చెన్నై రూ. 14 కోట్లు వెచ్చించింది. ఇటీవల అతను బ్యాట్ కూడా ఝులిపిస్తుండటంతో దీపక్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే అతన్ని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. పైగా పవర్ ప్లేలో ఒకటి, రెండు వికెట్లు తీసే సామర్థ్యం అతని సొంతం. ఆ లెక్కనే తగ్గేదేలే అంటూ చెన్నై వేలంలో దీపక్ కోసం పోటీపడింది. చివరకు రూ.14 కోట్లు భారీ ధర వెచ్చించి జట్టులోకి తెచ్చుకుంది. కానీ అనూహ్యరీతిలో అతను గాయపడటం.. జట్టుకు తీరని నష్టం చేయనుంది.
దీపక్ లేని లోటు పూడ్చడం ఆ జట్టుకు కష్టమే. దీపక్ కోసమే శార్దూల్ ఠాకూర్ కూడా చెన్నై వదిలేసింది. దీపక్ చాహర్ను భర్తీ చేసే బ్యాకప్ బౌలర్ చెన్నైకి లేడు. దీపక్ చాహర్ గైర్హాజరీలో చెన్నై తుషార్ దేశ్ పాండేతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే అండర్ 19 ప్రపంచకప్లో సత్తా చాటిన రాజ్వర్ధన్ హంగార్గేకర్ను స్టార్ పేసర్గా ధోనీ పదును పెట్టాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున దేశ్ పాండే నిరూపించుకున్నప్పటికీ.. చెన్నై తరఫున సత్తా చాటుతాడో లేదో చూడాలి. దీపక్ చాహర్ గైర్హాజరీలో శివమ్ ధూబే జట్టులో ఉండటం ఖాయం. అతను సత్తా చాటితే జట్టు దూసుకెళ్లవచ్చు. ధోనీ మార్క్ కెప్టెన్సీలో సాధారణ ఆటగాళ్లు కూడా స్టార్లు అవుతారు. గతంలో ఇలాంటి మ్యాజిక్లు మహీ ఎన్నో చేసి చూపించాడు. అసలు దీపక్ చాహర్ను తీర్చిదిద్దిందే ధోనీ. ఇదే నమ్మకంతో ఆటగాళ్లు ఉన్నారు.