బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో సోమవారం జరగనున్న మ్యాచ్లో తలపడనుంది. రాజస్థాన్తో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో ఓడిన చెన్నై.. బెంగళూరుపై గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.
మరోవైపు రెండు వరుస ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్పై అద్భుత విజయాన్నందుకు ఆర్సీబీ జోరు మీద ఉంది. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండటంతో మరోసారి సిక్సర్ల వర్షం కురువనుంది.

అయితే ఈ మ్యాచ్కు ముందు సీఎస్కేను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే దీపక్ చాహర్, బెన్ స్టోక్స్ గాయాలతో తుది జట్టుకు దూరంగా ఉండగా.. తాజాగా ఆ జాబితాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సిసింద మగలా చేరాడు. ఈ ఇద్దరూ గాయాలతో బాధపడుతున్నట్లు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ తెలిపాడు.
ధోనీ సైతం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అనంతరం కుంటుతూ కనిపించాడు. అతను మొకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మగలా ఆర్సీబీతో మ్యాచ్కు దూరమయ్యాడు. ధోనీ ఆడటంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయి. ఆర్సీబీతో మ్యాచ్ వరకు ధోనీ కోలుకుంటే బరిలోకి దిగుతాడు. లేదంటే బెంచ్కే పరిమితం కానున్నాడు.
అయితే ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ జట్టులో లేకపోవడం చెన్నై టీమ్కు సమస్యగా మారింది. ఒకవేళ ధోనీ కోలుకోకపోతే.. అంబటి రాయుడుతో వికెట్ కీపింగ్ చేయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ధోనీ గైర్హాజరీలతో రవీంద్ర జడేజా జట్టును నడిపించే అవకాశాలున్నాయి. సిసిందా మగలా స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ పతీరాణాలలో ఒకరు బరిలోకి దిగనున్నారు.
ఆర్సీబీతో ఆడే సీఎస్కే తుది జట్టు(అంచనా)
డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ/అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సింగ్