ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్దమైంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో డూఆర్డై మ్యాచ్ ఆడనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు కీలకం. ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరగా.. ఆఖరి బెర్త్ కోసం ఆర్సీబీ, సీఎస్కే తలపడుతున్నాయి.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించినా లేదా 18.1 ఓవర్లలో సీఎస్కే విధించిన లక్ష్యాన్ని పూర్తి చేసినా..మెరుగైన రన్రేట్తో ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఇలా కాకుండా ఓటమిపాలైనా.. స్వల్ప తేడాతో గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ మ్యాచ్కు వర్ష సూచన ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో బెంగళూరులో భారీ వర్షం పడనుంది. గత రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షపు నీరును త్వరగా క్లియర్ చేసే మంచి డ్రైనేజ్ సిస్టమ్ చిన్నస్వామి స్టేడియంలో ఉండటం కలిసొచ్చే అంశం. వర్షం కాసేపు ఆగినా.. మ్యాచ్ నిర్వహించే సౌకర్యాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్లో చెన్నై విజయం సాధించకపోయినా.. భారీ తేడాతో ఓటమిపాలవ్వద్దు. అప్పుడే ప్లే ఆఫ్స్ చేరుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ దిశగా ఆలోచిస్తే సీఎస్కే ఎక్స్ట్రా బ్యాటర్తో బరిలోకి దిగవచ్చు.
అయితే వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు ఈ మ్యాచ్లో కూడా చోటు దక్కే అవకాశాలు లేవు. అతను మళ్లీ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఓపెనర్లుగా రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మిడిలార్డర్లో డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ ఆడనున్నారు. పేసర్లుగా శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జిత్ సింగ్ ఆడనుండగా.. మహీష్ తీక్షణ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు.
సీఎస్కే తుది జట్టు(అంచనా)
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్రసింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్, మహీష్ తీక్షణ
ఇంపాక్ట్ ప్లేయర్: సమీర్ రిజ్వీ