ఐపీఎల్ 2025 సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మంగళవారం రాత్రి 7.30 గంటలకు ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో సీఎస్కే అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్లో విజయం సాధించిన సీఎస్కే ఆ తర్వాత.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మూడు మ్యాచ్ల్లో బ్యాటింగ్ వైఫల్యం సీఎస్కే ఓటమిని శాసించింది.
తుది జట్టులో మార్పులు చేసినా..సీఎస్కేకు ఆశించిన ఫలితం దక్కలేదు. మరోవైపు మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచి ఒక మ్యాచ్ ఓడిన పంజాబ్.. సొంతగడ్డపై సీఎస్కేను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్ల ముఖా ముఖి పోరులో సీఎస్కేదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరగ్గా.. సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్లు గెలిచాయి. గత సీజన్లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో విజయం సాధించాయి.

బ్యాటింగ్ వైఫల్యం..
వరుసగా మూడు పరాజయాలు ఎదురవ్వడంతో సీఎస్కే తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలనే కసితో ఉంది. అందుకోసం టీమ్ కాంబినేషన్ను మార్చేందుకు కూడా సిద్దంగా ఉంది. టాపార్డర్ వైఫల్యం సీఎస్కే కొంపముంచుతోంది. గత మ్యాచ్తో తుది జట్టులోకి వచ్చిన డెవాన్ కాన్వే తీవ్రంగా నిరాశపరిచాడు. ఆరంభ మ్యాచ్ల్లో మెరుగ్గా ఆడిన రచిన్ రవీంద్ర.. గత రెండు మ్యాచ్ల్లో తేలిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రాణించలేకపోతున్నారు. డేంజరస్ శివమ్ దూబే.. తన బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు.
విజయ్ శంకర్పై వేటు..
దాంతో చెన్నై సూపర్ కింగ్స్ వరుస మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. గత మ్యాచ్లో విజయ్ శంకర్ హాఫ్ సెంచరీతో రాణించినా.. టెస్ట్ తరహా బ్యాటింగ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అతని స్థానంలో తెలుగు తేజం షేక్ రషీద్కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అతనికి అవకాశం ఇస్తే.. షేక్ రషీద్కు అరంగేట్ర మ్యాచ్ కానుంది.
బౌలింగ్లో మార్పుల్లేవ్..
మరోవైపు గతంలో పంజాబ్ కింగ్స్ ఆడిన సామ్ కరణ్ను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముల్లాన్పూర్ గ్రౌండ్పై ఆడిన అనుభవం అతనికి ఉంది. కానీ సామ్ కరణ్ జట్టులోకి వస్తే డెవాన్ కాన్వేను తప్పించాల్సి ఉంటుంది. కాబట్టి సీఎస్కే అతన్ని ఆడించకపోవచ్చు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనుండగా.. నూర్ అహ్మద్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ, ముఖేష్ చౌదరి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పంజాబ్తో సీఎస్కే తుది జట్టు(అంచనా):
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, శివమ్ దూబే/షేక్ రషీద్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ, ముఖేష్ చౌదరి.