అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ వరల్డ్ బెస్ట్ టీ20 లీగ్కు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. ఈ సారి లీగ్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ ఫార్మాట్లో మార్పులు చేయడంతో పాటు కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
వైడ్, నోబాల్కు రివ్యూ, టాస్ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్ ప్లేయర్.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్లో ప్రవేశ పెట్టబోతుంది. అయితే గుజరాత్ టైటాన్స్తో జరిగే తొలి మ్యాచ్కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రాక్టీస్ సెషన్లో ధోనీ ఎడమ మొకాలికి గాయమైందని, తొలి మ్యాచ్ ఆడలేడని వార్తలు వచ్చాయి.

వీటిని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఖండించాడు. తొలి మ్యాచ్ ఆడేందుకు ధోనీ ఫిట్గా ఉన్నాడని చెప్పాడు. అయితే ధోనీ పూర్తి మ్యాచ్ ఆడలేని పరిస్థితి ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది.
ఈ రూల్తో ధోనీని బ్యాటింగ్కు పంపించి, డెవాన్ కాన్వేతో కీపింగ్ చేయాలని ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ రూల్తో టీమ్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వనుంది. జట్టు ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ ఆడనుండగా.. ఫస్ట్ డౌన్లో మొయిన్ అలీ, నాలుగో స్థానంలో బెన్ స్టోక్స్ ఆడనున్నారు.
ఐదో స్థానంలో అంబటి రాయుడిని, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించి ఎనిమిదో స్థానంలో ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించాలని సీఎస్కే భావిస్తోంది. దీపక్ చాహర్, డ్వేన్ ప్రిటోరియస్, సిమ్రన్జిత్ సింగ్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు.
తుది జట్టు(అంచనా)
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, డ్వేన్ ప్రిటోరియస్, సిమర్జీత్ సింగ్/తుషార్ దేశ్పాండే