ఐపీఎల్ 2024 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో సీఎస్కే అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు గుజరాత్ టైటాన్స్కు ఇది చావోరేవో మ్యాచ్. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇరు జట్లకు ఈ విజయం కీలకం. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ను ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.
అయితే సీఎస్కేను గాయాల బెడదతో పాటు ఆటగాళ్ల అనారోగ్యం వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ పేసర్ మతీష పతీరణ తొడ కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదేశాలతో ముస్తాఫిజుర్ అహ్మద్ స్వదేశం పయనమయ్యాడు.మరికొంత మంది కీలక ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే సీఎస్కేకు తుది జట్టు ఎంపిక సవాల్గా మారింది. అయితే పంజాబ్ కింగ్స్తో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. దాంతో రచిన్ రవీంద్రతో పాటు జట్టులో చోటు కోసం ఆశిస్తున్న యువ ఆటగాళ్లకు నిరాశే ఎదురవ్వనుంది. ముఖ్యంగా రాజవర్దనే హంగార్గేకర్, దీపక్ చాహర్లు బెంచ్కు పరిమితం కానున్నారు.
ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే కొనసాగనుండగా.. మిడిలార్డర్లో డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మొయిన్ అలీ ఆడనున్నారు. మిచెల్ సాంట్నర్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. గత మ్యాచ్లో సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్న సిమర్జీత్ సింగ్ను కూడా తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
అయితే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించనున్నారు. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లీసన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవీంద్ర జడేజా, ధోనీ ఫినిషర్లుగా ఆడనున్నారు.
గుజరాత్ టైటాన్స్తో సీఎస్కే తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, మహేంద్ర సింగ్ ధోనీ, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లీసన్
ఇంపాక్ట్ ప్లేయర్: సిమర్జీత్ సింగ్