ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహనం కోల్పోయి టీవీ పగలగొట్టాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆ జట్టు వర్గాలు ఖండించాయి. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అంతా ఫేక్ న్యూస్ అంటూ సీఎస్కే ఫిజియోథెరపిస్ట్ టామ్మీ సిమ్సెక్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే ఓటమిపాలవ్వడంతో ధోనీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, డ్రెస్సింగ్ రూమ్కు సమీపంగా ఉన్న టీవీని పగలగొట్టాడని హర్భజన్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ మ్యాచ్కు తాను కామెంటేటర్గా వ్యవహరించినట్లు కూడా చెప్పుకొచ్చాడు. దాంతో ఈ వార్త నెట్టింట చర్చనీయాంశమైంది. ప్రశాంతంగా ఉండే ధోనీ సహనం కోల్పోయి టీవీ పగలగొట్టాడా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు.

అయితే ఈ వార్తలను చూసి అవాక్కైన సీఎస్కే ఫిజియోథెరపిస్ట్ టామ్మీ సిమ్సెక్.. ఇదంతా చెత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వార్తలను ఖండించాడు.'ఇదంతా చెత్త. ధోనీ దేన్ని పగలగొట్టలేదు. ఏ మ్యాచ్ తర్వాత కూడా అతను నాకు కోపంగా కనిపించలేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్'అని పేర్కొన్నాడు.
ఆర్సీబీతో జరిగిన నాటి మ్యాచ్ సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆ జట్టుకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ సంచలన బౌలింగ్తో ధోనీని ఔట్ చేయడంతో పాటు 7 పరుగులే ఇచ్చి ఆర్సీబీని ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఈ గెలుపుతో టైటిల్ గెలిచిన రీతిలో ఆర్సీబీ సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇద్దామని వచ్చిన ధోనీ.. వారు ఎంతకు రాకపోవడంతో అక్కడున్న వారికి ఇచ్చి డగౌట్కు వెళ్లిపోయాడు.
అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇలా వెళ్లే క్రమంలో ధోనీ.. డ్రెస్సింగ్ రూమ్ బయట ఉన్న టీవీని పగలగొట్టాడని హర్భజన్ సింగ్ తెలిపాడు. 'సంచలన విజయంతో ఆర్సీబీ సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్కు నేను కామెంటేటర్గా వ్యవహరించాను.మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సంబరాలను పై నుంచి చూశాను.
ఓవైపు బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. మరోవైపు సీఎస్కే ఆటగాళ్లు వారికి కరాచలనం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కానీ, ఆర్సీబీ ఆటగాళ్లు వారిని పట్టించుకోలేదు. దాంతో అసహనానికి గురైన ధోనీ.. అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో బయట ఉన్న ఓ స్క్రీన్ను చేతిలో బలంగా బాదాడు. ప్రతీ ఆటగాడికి భావోద్వేగాలు ఉంటాయి. క్రీడల్లో ఇలాంటి ఘటనలు సహజం.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.