
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త. కరోనా కొరల్లో చిక్కుకొని విలవిలలాడిన ఆ జట్టు కోలుకుంటుంది. మహమ్మారి బారిన పడిన ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ పూర్తిగా కోలుకున్నాడు. అతనితో పాటు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న సహాయక సిబ్బందికి తాజాగా నిర్వహించిన రెండు పరీక్షల్లో నెగటీవ్ వచ్చిందని టీమ్ సీఈవో కేఎస్ విశ్వనాథన్ పీటీఐ వార్త సంస్థకు తెలిపారు.
అయితే కోవిడ్ బారిన పడిన మరో యువ ఆటగాడు రుతు రాజ్ గైక్వాడ్, సహాయక సిబ్బందిలో ఒకరి ఐసోలేషన్ ఇంకా పూర్తికాలేదని, పూర్తి అయిన వెంటనే వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నెగటీవ్ వచ్చిన దీపక్ చాహర్, సహాయక సిబ్బంది టీమ్ బయో బబుల్లోకి ప్రవేశించారన్నారు. 'కరోనా బారిన ఆటగాళ్లు, సహాయక సిబ్బందిలో రుతురాజ్ గైక్వాడ్, సహాయక సిబ్బంది ఒకరు మినహా అందరూ కోలుకున్నారు. వారికి తాజాగా నిర్వహించిన రెండు పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. అయితే రుతురాజ్, సదరు సిబ్బంది క్వారంటైన్ మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఆ వెంటనే వారికి కూడా కరోనా పరీక్షలు జరుపుతాం'అని విశ్వనాథన్ పేర్కొన్నారు.

ఇక కరోనా నుంచి కోలుకున్న దీపక్ చహర్ను ఇప్పుడే ప్రాక్టీస్ చేయడానికి అనుమతించమన్నారు. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం కార్డియాక్, ఇతర పరీక్షలు నిర్వహించిన తర్వాత అతని ప్రాక్టీస్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తామన్నారు. 'దీపక్ చహర్కు కోవిడ్-19 నెగటీవ్ వచ్చింది. కానీ ఇప్పుడే అతన్ని ప్రాక్టీస్కు అనుమతించం. బీసీసీఐ ప్రొటోకాల్స్ ప్రకారం అతను కార్డియో, ఇతర టెస్ట్లు చేసుకోవాల్సి ఉంది. అవన్నీ పూర్తయిన తర్వాతే అతను మైదానంలోకి దిగుతాడు'అని సీఈవో స్పష్టం చేశారు. కార్డియో టెస్ట్తో అతని రికవరీపై స్పష్టత వస్తుందన్నారు. ఇదంత జరగడానికి నాలుగైదు రోజులు పడుతుందన్నారు.
ఇక ప్రాక్టీస్ సెషన్కు సిద్దమైన చెన్నైకి కరోనా షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు ఆటగాళ్లతో పాటు 11 మంది సిబ్బందికి పాజిటీవ్ రావడం కలకలం రేపింది. ఆ జట్టు క్వారంటైన్ కూడా పెరిగింది. దీంతో ఓ వారం ఆలస్యంగా చెన్నై ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది. దీంతో ఈ లీగ్ నిర్వహణపై అనేక సందేహాలు రెకెత్తాయి. దీనికి తోడు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ తప్పుకోవడంతో అందరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ జట్టు ప్రారంభ మ్యాచ్ ఆడలేదనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఇవన్నీటిని అధిగమించిన చెన్నై.. సెప్టెంబర్ 19 డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ను ఢీకునేందుకు సమాయత్తం అవుతోంది.