
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో తమ జట్టు బ్యాటింగ్ తీరును చెన్నై సూపర్ కింగ్స్ ట్రోల్ చేసింది. తమ అధికారిక ట్విటర్లో ఓ ఫన్నీ మీమ్ను షేర్ చేసింది. తమిళ కమేడియన్ వడివేలుతో కూడిన ఫన్నీ ఫొటోతో ధోనీ సేనపై సెటైర్లు పేల్చింది. ఈ ఫొటోలో వడివేలు క్రికెట్ ప్యాడ్స్ కట్టుకొని ఓ చేతిలో బ్యాట్.. మరో చేతిని నెత్తిన పెట్టుకొని దిగాలుగా కూర్చున్నాడు.
అతని పక్కన వారు కూడా బాధలో ఉన్నట్లున్నారు. ఈ ఫోటోకు బాధలో ఉన్న ఎమోజీని సీఎస్కే ట్విటర్ హ్యాండిల్ క్యాప్షన్గా పేర్కొంది. ఇక చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా.. ధోన్నీ క్రీజులో ఉండగానే ఈ ఫోటోను షేర్ చేయడంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఫన్నీగా స్పందించారు. మ్యాచ్ అప్పుడే అయిపోలేదు సామీ.. తాల ఉన్నాడు గెలిపిస్తాడని కొందరంటే.. నువ్వు ఒక్కడివి చాలయ్యా.. మరెవరూ ట్రోల్ చేయకుండా నీకు నీవే చేసుకుంటున్నావని ఇంకొందరూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ హ్యాండిల్ తమ జట్టును ట్రోల్ చేయడం ఇదే తొలి సారి కాదు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా తమ జట్టు ఆటతీరు చూస్తుంటే నిద్రవస్తుందనే ఫన్నీ మీమ్ షేర్ చేసింది. ఆ మ్యాచ్లో కూడా సీఎస్కే చేజింగ్లో తడబడింది. దాంతో నోరు తెరిచి గురకపెట్టి నిద్ర పోతున్న ఓ వ్యక్తి ఫొటోను అభిమానులతో పంచుకుంది.
ఇక ధోనీ కడవరకు నిలిచిన ఈ మ్యాచ్లో సీఎస్కేకు విజయం దక్కలేదు. తొలుత బ్యాటింగ్కు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనామక ఆటగాళ్లు ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడు అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 31) రాణించాడు. 69 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఈ చిచ్చర పిడుగులు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా చావ్లా, ఠాకుర్ తలో వికెట్ తీశారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 47 నాటౌట్), రవీంద్ర జడేజా(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50) రాణించినా ఫలితం లేకపోయింది.