దుబాయ్: తమ టీమ్ బ్యాటింగ్ తీరును చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ హ్యాండిల్ ట్రోల్ చేసింది. నిదానంగా సాగుతున్న తమ జట్టు ఇన్నింగ్స్ చూస్తే తమకు నిద్రవస్తుందనే ఫన్నీ మీమ్ను అభిమానులతో పంచుకుంది. నోరు తెరిచి గురకపెట్టి నిద్ర పోతున్న ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు మంచి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు షేన్ వాట్సన్(14), మురళీ విజయ్(10) దారుణంగా విఫలమయ్యారు.
మూడో ఓవర్లో లభించిన లైఫ్ను కూడా వాట్సన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ ఓవర్లో నోర్జ్ వేసిన మూడో బంతిని వాట్సన్ లెగ్ సైడ్ కొట్టగా ఫార్వార్డ్ ప్లేయర్గా ఉన్న పృథ్వీ షా సునాయస క్యాచ్ను వదిలిపెట్టాడు. అయినా చెన్నై రాత మారలేదు. పేలవ షాట్లతో ఓపెనర్లు ఇద్దరూ క్యాచ్ ఔట్లుగా వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చి రుతురాజ్ గైక్వాడ్(5) అదృష్టం కలిసిరాక రనౌట్గా పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్తో ఫాఫ్ డూప్లెసిస్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బౌండరీలు కొట్టకపోవడంతో మ్యాచ్ చాలా బోరింగ్గా సాగింది. మరోవైపు చేజింగ్ రన్రేట్ పెరుగుతున్నా.. బ్యాట్స్మెన్ నిదానంగా ఆడటాన్ని ఉద్దేశించే చెన్నై సెటైరిక్గా ట్వీట్ చేసింది.
ఇక క్రీజులో కుదురుకుంటుండగా జాదవ్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత డూప్లెసిస్, ధోనీ, జడేజా కూడా ఔటవ్వడంతో చెన్నైకి ఘోర ఓటమి తప్పలేదు. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్.. 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించింది.
— Chennai Super Kings (@ChennaiIPL) September 25, 2020