చెన్నై: దేశంలో నెలకొన్న పరిస్థితులు.. ఐపీఎల్ 2020 సీజన్ వాయిదాతో అగ్రశ్రేణి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 15కి టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. అయితే.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో టోర్నీ రద్దయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ విలువ అనూహ్యంగా పడిపోయింది. సీఎస్కే మార్కెట్ వాల్యూ రూ. 1000 కోట్లు ఉండగా.. ఇప్పుడు అది రూ. 800 కోట్లకు పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 2019లో వెలువడిన లెక్కలు ప్రకారం.. ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ రూ.809 కోట్లుకాగా.. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 732 కోట్లు. ఆ తర్వాత మూడో స్థానంలో కోల్కతా నైట్రైడర్స్ రూ. 629 కోట్లతో ఉంది.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ముంబై ఇండియన్స్ ఏకంగా నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ గెలవగా.. కోల్కతా రెండు సార్లు టోర్నీ విజేతగా నిలిచింది. దీంతో.. ఈ మూడు జట్లకు బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉంది.