
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయలో డ్రాగన్ కంట్రీ చైనా సైనికులతో నెలకొన్న ఘర్షణలో వీరమరణం పొందిన భారత జవాన్లపై, కేంద్ర ప్రభుత్వంపై వివాదాస్పద ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ డాక్టర్ మధు తొట్టప్పిలిల్ గురువారం బేషరతు క్షమాపణ చెప్పాడు. సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నాడు. తన చర్య పట్ల బాధ పడిన ప్రతీ ఒక్కరికి క్షమాపణ చెబుతున్నానని అన్నాడు.
'జూన్ 16న నేను చేసిన ట్వీట్లో వాడిన పదాలు సరైనవి కావని తర్వాత తెలుసుకున్నా. వెంటనే దాన్ని తొలగించా. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ పౌరుల కోసం, ఆర్మీ కోసం కేంద్రం తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తా. నా ట్వీట్ వేలాది మంది భారతీయుల మనోభావాల్ని దెబ్బతీసింది. దానికి చింతిస్తున్నా. హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా' అని రాసుకొచ్చాడు.
ఇక గాల్వాన్ లోయఘటనను ఉద్దేశించి 'జవాన్ల శవపేటికలపై పీఎం కేర్స్ అన్న స్టిక్కర్ అతికిస్తారేమో! ఆసక్తి కొద్దీ ఇది అడుగుతున్నా'అని మధు చేసిన ట్వీట్పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో అతను ఆ ట్వీట్ తొలగించాడు. ఈ వివాదాస్పద ట్వీట్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎకే యాజమాన్యం మధును తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.