సౌతాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ రిప్లేస్మెంట్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం డెవాల్డ్ బ్రెవిస్ను జట్టులోకి తీసుకున్నామని ప్రకటించింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో యువ పేసర్ గుర్జప్నీత్ సింగ్ను రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే అతను గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
అనంతరం సీఎస్కే అతని స్థానాన్ని డెవాల్డ్ బ్రెవిస్తో రూ.2.2 కోట్లకు భర్తీ చేసింది. అయితే ఇటీవలే డెవాల్డ్ బ్రెవిస్ రిప్లేస్మెంట్కు సంబంధించి ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు చేశాడు. బ్రెవిస్కు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించారని తెలిపాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది. సీఎస్కే రూల్స్ ఉల్లంఘించి డెవాల్డ్ బ్రెవిస్ను తీసుకుందనే విమర్శలు వచ్చాయి. సీఎస్కేపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలోనే సీఎస్కే వివరణ ఇస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

'ఐపీఎల్ 2025 కోసం డెవాల్డ్ బ్రెవిస్ను రిప్లేస్మెంట్ ఆటగాడిగా నిబంధనల మేరకే తీసుకున్నాం. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు.'అని స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్లేయర్స్ రెగ్యూలేషన్స్లోని సెక్షన్ 6.6 రీప్లేస్మెంట్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు గాయపడినా.. ఇతర కారణాలతో టోర్నీకి దూరమైనా.. సదరు ప్లేయర్ ధరతోనే ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవాలి.
ఈ రూల్ ప్రకారం గుర్జప్నీత్ సింగ్కు ప్రత్యామ్నాయంగా డెవాల్డ్ బ్రెవిస్ను రూ. 2.2 కోట్లకే కొనుగోలు చేయాలి. కానీ బ్రెవిస్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడటంతో ప్లేయర్ ఏజెంట్స్కు భారీ ధర చెల్లించి సీఎస్కే కొనుగోలు చేసిందని అశ్విన్ తెలిపాడు. రూ. 2.2 కోట్లకే భర్తీ చేశామని చెబుతున్నా.. తెర వెనుక భారీ మొత్తంలో డబ్బులు చెల్లించిందనే అభిప్రాయం కలుగుతోంది. అలా చేస్తే ఐపీఎల్ రూల్స్ ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ క్రమంలోనే సీఎస్కేపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆ జట్టు వివరణ ఇచ్చుకుంది.