న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చాలా ఇబ్బంది పడ్డాడని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. ఓ దశలో ధోనీ కంటే ముందు బ్యాటింగ్ చేసేందుకు చాలా భయపడ్డాడని తెలిపాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్తో చెన్నై విజయం సాధించింది. చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో జడేజా సూపర్ బ్యాటింగ్తో సిక్స్, ఫోర్ బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ముందు వరకు జడేజాను ధోనీ అభిమానులు ఘాటుగా విమర్శించారు.

జడేజా సైతం వారి ట్రోలింగ్ను తనదైన శైలిలో తిప్పికొడుతూ ట్వీట్ చేశాడు. చివరకు విమర్శించినవారే జడేజాను కొనియాడారు. ధోనీ బ్యాటింగ్ చూసేందుకు జడేజా ఔటవ్వాలని అభిమానులు కోరుకున్నారు. ఈ విషయాన్ని జడేజా సైతం ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా చాలా సార్లు చెప్పాడు. అయితే కొందరు హద్దులు ధాటి విమర్శించడంతో జడేజా సీరియస్ అయ్యాడు.
తాజాగా ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. ధోనీ అభిమానుల ఓవరాక్షన్ వల్ల జడేజా ఇబ్బందులకు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా, ధోనీ మధ్య విభేదాలున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాశీ విశ్వనాథన్ ఖండించాడు. ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని తెలిపాడు.

'ఈ సీజన్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, మొయిన్ అలీ, అజింక్యా రహానే, శివమ్ దూబేలు అద్భుతంగా రాణించడంతో జడేజాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. చివర్లో
5-10 బంతులు మిగిలి ఉన్నప్పుడు జడ్డూ బ్యాటింగ్కు వచ్చేవాడు.
అప్పుడు కూడా ఫ్యాన్స్, ధోనీ ధోనీ. అని అరుస్తుండడంతో అతను చాలా ఫీలయ్యాడు. చాలాసార్లు ఆ ప్లేస్లో బ్యాటింగ్కు వెళ్లకపోవడమే బెటర్ అని అనుకున్నాడు. అందరికీ ఇలాంటి ఒత్తిడి ఉండటం మామూలే. అయితే ఎవరీపై కూడా జడేజా మాకు ఫిర్యాదు చేయలేదు. ధోనీ పట్ల జడేజాకు అపారమైన గౌరవం ఉంది. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
మ్యాచ్ అనంతరం నేను జడేజాతో మాట్లాడిన ఫొటోను ఒకటి వైరల్ చేసి లేని పోని పుకార్లు పుట్టించారు. వాస్తవానికి అది మ్యాచ్కు సంబంధించిన డిస్కషన్ మాత్రమే. కానీ జడేజాను నేను సముదాయిస్తున్నట్లు ప్రచారం చేశారు.'అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు.