ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫీవర్ మొదలైంది. ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసి నెల రోజులవుతున్నా.. ఈ టోర్నీ గురించి చర్చ మాత్రం ఆగడం లేదు. తమ అభిమాన జట్లకు మద్దతుగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూనే ఉన్నారు. ఫ్రాంచైజీలు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులపై జోకులు పేల్చాడు. తన వ్యాఖ్యలతో వారిని రెచ్చకొట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఆర్సీబీ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య చెన్నైలో చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయం నమోదు చేయడంతో పాటు మెరుగైన రన్రేట్తో ప్లే ఆఫ్స్ చేరింది.

దాంతో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ అతి సంబరాలతో సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ చేరాడు. కాసేపు మైదానంలో వేచి చూసిన ధోనీ.. ఆర్సీబీ ఆటగాళ్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.
ఆర్సీబీ అతి సంబరాలు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాళ్లు, అభిమానులకు నచ్చలేదు. దాంతో ఆర్సీబీ తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. కొన్నిచోట్ల ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ కొట్టుకున్నారు. అంబటి రాయుడు వంటి మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే ఆర్సీబీని విమర్శించారు. విరాట్ కోహ్లీని తక్కువ చేసేలా మాట్లాడారు.
దాంతో ఇరు జట్ల మధ్య శతృత్వం ఏర్పడింది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ఓడిపోవాలని సీఎస్కే ఫ్యాన్స్ కోరుకున్నారు. ఈ శతృత్వం అప్కమింగ్ సీజన్లోనూ కొనసాగే అవకాశం ఉంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ గొడవకు మరింత ఆజ్యం పోసాడు. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రుతురాజ్ గైక్వాడ్.. ఆర్సీబీ అభిమానులను ఉద్దేశించి జోక్ చేశాడు.
ఈ కార్యక్రమంలోనే రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతుండగా.. మైక్ ఆఫ్ అయ్యింది. దాంతో అక్కడున్న యాంకర్.. రుతురాజ్ మైక్ ఎలా ఆఫ్ అయ్యిందని ప్రశ్నించాడు. అందుకు రుతురాజ్ గైక్వాడ్ ఆర్సీబీ అభిమానులు ఆఫ్ చేసి ఉంటారని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. తన జోక్తో ఆర్సీబీతో ఉన్న శత్రుత్వాన్ని రుతురాజ్ గైక్వాడ్ బయటపెట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.