
ముంబై: ట్విటర్ వేదికగా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ జట్లుగా ఐపీఎల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ నిలిచాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి ట్విటర్ వేదికగా జరిగిన ఇంటరాక్షన్స్ ఆధారంగా ఈ మూడు టీమ్స్ పాపులర్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా మరే క్రికెట్ టోర్నీలు పెద్దగా జరగడం లేదు. దాంతో యావత్ క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ను వీక్షిస్తున్నారు. ఇక అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన సీఎస్కే, ఆర్సీబీ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
దాంతో ఈ రెండు జట్లు పాపులర్ లిస్ట్లో టాప్-2లో నిలిచాయి. ఫన్నీ ట్వీట్స్తో నెటిజన్లు అలరించే రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్.. తన జట్టును టాప్-3లో నిలబెట్టాడు. అతని కారణంగానే అభిమానులు రాజస్థాన్ రాయల్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. అతని ఫన్నీ ట్వీట్స్ను రీట్వీట్ చేయడంతో పాటు కామెంట్లతో స్పందించడంతో ఆ జట్టుకు పాపులర్ క్రికెట్ టీమ్స్ జాబితాలో మూడో ప్లేస్లో చోటు దక్కింది.
ముంబై ఇండియన్స్ మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ జట్టు పేలవ ప్రదర్శనతో అందరికన్నా ముందే ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో అభిమానులు లైట్ తీసుకున్నారు. చెన్నై టీమ్ పేరిట 670 మిలియన్ల ఇంటరాక్షన్స్ జరగ్గా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట 420 మిలియర్ల ఇంటరాక్షన్స్ జరిగాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ 417 మిలియన్లు, ముబై ఇండియన్స్ 313 మిలియన్స్ ఇంటరాక్షన్స్ జరిపాయి.
ఓవరాల్గా పాపులర్ స్పోర్ట్స్ టీమ్స్ జాబితాలో చెన్నై, ఆర్సీబీ, రాజస్థాన్ వరుసగా 8,9,10 స్థానాలతో టాప్-10లో చోటు దక్కించుకోగా.. ముంబై 17వ స్థానంలో నిలిచింది. రియల్ మాడ్రిడ్, ఎఫ్సీ బార్సిలోనా టాప్-2లో నిలిచాయి.