
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్, సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డ్వేన్ ప్రిటోరియస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతూ అందర్నీ షాక్కు గురి చేశాడు. సౌతాఫ్రికా జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో మొత్తం 60 మ్యాచ్లు ఆడిన ప్రిటోరియస్.. టీ20 మేటీ ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. ఏడేళ్ల కెరీర్లో 30 టీ20లు, 27 వన్డేలు, 3 టెస్టులు ఆడిన ప్రిటోరియస్... 1,895 పరుగులు చేయడమే కాకుండా 77 వికెట్లు పడగొట్టాడు.
ఫ్రాంచైజీ క్రికెట్పై మరింత ఫోకస్ పెట్టేందుకే తాను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రిటోరియస్ వెల్లడించాడు. 'క్రికెట్ కెరీర్కు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే నేను అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలనుకున్నాను. సౌతాఫ్రికాకు ఆడాలనే ఆశయంతో వచ్చి ఇక్కడిదాకా ఎలా రాగలిగానో అనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. అయితే దేవుడిచ్చిన ప్రతిభ, ఆట పట్ల నిబద్దత చూపగల లక్షణం.. నేను విజయవంతమయ్యేలా చేశాయి. ఇక ముందు కూడా నా భవిష్యత్తు ఆయనే నిర్ణయిస్తాడు'అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
అంతేకాకుండా తన క్రికెట్ జర్నీలోని ముఖ్యమైన వ్యక్తులు, సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. 'జట్టులో చోటు కోల్పోయినప్పుడు ఫాఫ్ డుప్లెసిస్ నాకు దన్నుగా నిలిచాడు. నా ఆట మెరుగుపడడంలో అతను ఎంతో సహకరించాడు. మైదానంలోకి దిగిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాను. పాదాలు, వేళ్లు, కండరాల గాయాలు వేధిస్తున్నా కూడా బరిలోకి దిగాను. డ్రింక్స్ మోశాను. తోటి ఆటగాళ్లకు నావంతు మేరకు సాయం చేశాను' అని ఈ ఆల్రౌండర్ పేర్కొన్నాడు.
గతేడాది పాకిస్థాన్తో చివరి టీ20 మ్యాచ్ ఆడిన ప్రిటోరియస్... లాహోర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా పురుషుల టీ20ల్లో సౌతాఫ్రికా బౌలర్ ఉత్తమ ప్రదర్శన ఇతనిదే కావడం విశేషం. ప్రిటోరియస్ 2016లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగ్రేటం చేశాడు. ఈ ఆల్రౌండర్ 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. గతేడాది నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నాడు. రూ.50 లక్షల కనీస ధరకు చెన్నై అతన్ని కొనుగోలు చేసింది. ఈ సీజన్కు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్లో 6 మ్యాచ్లాడిన ప్రిటోరియస్ 6 వికెట్లు పడగొట్టాడు.