
కోల్కతా: టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో షిబ్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గత ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్లో చేరిన మనోజ్కు టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ షిబ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో మనోజ్ తివారి బీజేపీకి చెందిన రథిన్ చక్రవర్తిపై 6వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
మనోజ్ తివారీ భారత్ తరఫున 2008లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. జట్టులోని సీనియర్ల కారణంగా అతను అవకాశాలు అందుకోలేకపోయాడు. సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్కే అతను బెంచ్కు పరమితమయ్యాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన అతనికి 2018 ఐపీఎల్ సీజన్ చివరిది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మొత్తం 98 మ్యాచ్లు ఆడిన తివారీ 7 హాఫ్ సెంచరీలతో 1695 పరుగులు చేశాడు. ఓ వికెట్ కూడా తీశాడు. అయితే తివారీ ఇప్పటి వరకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోవడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఏకంగా 213 సీట్లను కైవసం చేసుకుంది. 77 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.