T20 World Cup 2024: వన్డే ప్రపంచకప్ 2023 ముగియడంతో అందరి కళ్లు అప్కమింగ్ టీ20 ప్రపంచకప్పై పడ్డాయి. వచ్చే ఏడాది జూన్లోనే ఈ పొట్టి కప్ జరగనుండటంతో ఆయా జట్లన్నీ తమ సన్నాహకాలు ప్రారంభించాయి. టీమిండియా కూడా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తోనూ ప్రపంచకప్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అయితే టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ టీ20 ప్రపంచకప్లో భాగమవుతారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈ ఇద్దర్నీ పక్కనపెట్టి కుర్రాళ్లతోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతుందా? లేక అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్లతో ఉన్న జట్టును బరిలోకి దించుతుందా? అనేది తేలాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యంపై అటు బీసీసీఐ కానీ.. ఇటు స్టార్ ఆటగాళ్లు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ దిగ్గజ క్రికెటర్లంతా ఈ ఇద్దర్నీ టీ20 ప్రపంచకప్ ఆడాలని సూచిస్తున్నారు. టీమిండియా విజేతగా నిలవాలన్నా.. అద్భుత ప్రదర్శన కనబర్చాలన్నా జట్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శన కనబర్చారని, వారి అనుభవం జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

క్రికెట్ దిగ్గజాలు గౌతమ్ గంభీర్, వసీం అక్రమ్లు రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ ఆడాలని సూచిస్తున్నారు.
'మరో 6 నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. నేను అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దర్నీ జట్టులోకి తీసుకుంటా. ప్రస్తుతం భారత్కు ఈ ఇద్దరే ప్రధాన ఆటగాళ్లు. టీ20ల్లో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. కుర్రాళ్లతోనే బరిలోకి దిగుతానంటే ఫలితం దక్కదు.'అని వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
'రోహిత్తో పాటు విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలి. ముఖ్యంగా రోహిత్ శర్మ సారథ్యంలోనే బరిలోకి దిగాలి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నా.. రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు అప్పగించాలి. రోహిత్ శర్మను కేవలం బ్యాటర్గా మాత్రమే తీసుకోవద్దు. రోహిత్ అసాధారణ కెప్టెన్. వన్డే ప్రపంచకప్లో తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. రోహిత్ శర్మను తీసుకుంటే కెప్టెన్గా తీసుకోవాలి.'అని గౌతమ్ గంభీర్ సూచించాడు.