న్యూఢిల్లీ: నాలుగేళ్లకు ఒకసారి యావత్ క్రికెట్ ప్రపంచం పోటీ పడే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కింది. ఇటీవలే ఈ ప్రతిపాదనపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఆమోదం తెలపగా.. తాజాగా ఐఓసీ సదస్సులో ఓటింగ్ నిర్వహించారు. ఐఓసీలోని ఇద్దరు సభ్యులు మాత్రమే క్రికెట్ను వ్యతిరేకించగా.. మిగిలిన వారంతా అనుకూలంగా ఓటేసారు.
ముంబైలోనే ఐఓసీ సదస్సు జరగడం విశేషం. ఐఓసీ సభ్యుల ఆమోదం కూడా లభించడంతో క్రికెట్ ఒలింపిక్స్లో భాగమైనట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. ఐదు క్రీడలను చేర్చాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా ప్రకటించారు.

అయితే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. క్రికెట్ (టీ20)తో పాటు బేస్ బాల్- సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లక్రాస్ (సిక్సస్), స్క్వాష్లకు కూడా ఒలింపిక్స్లో అవకాశం కల్పించారు. ఇక ఐఓసీ విడుదల చేసిన పోస్టర్లో క్రికెట్ ఐకాన్గా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోను ఉపయోగించారు.
లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ నిర్వాహకులు విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించారు. విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని ఓ ఆర్గనైజర్ వెల్లడించాడు. 'సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి 340 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన మూడో అథ్లెట్ అతను. అతను ఇప్పటికే టైగర్ వుడ్స్, లీబ్రోన్, టామ్ బ్రాడీలను వెనక్కునెట్టాడు.'అని సదరు ఆర్గనైజర్ చెప్పుకొచ్చాడు.
తాజా నిర్ణయంతో 148 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. చివరి సారిగా 1900 ఒలింపిక్స్లో క్రికెట్ భాగంగా ఉంది. అదే తొలిసారి, చివరిసారి కూడా. అప్పుడు డెవాన్ అండ్ సోమర్సెట్ వండరర్స్ క్లబ్ (బ్రిటన్), ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ (ఫ్రాన్స్) మధ్య రెండు రోజుల మ్యాచ్ నిర్వహించారు.
అయితే ఈ మ్యాచ్లో ఒక్క జాతీయ ఆటగాడూ లేకపోవడంతో పాటు జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడారు. దాంతో ఈ మ్యాచ్కు ఫస్ట్క్లాస్ హోదా కూడా దక్కలేదు. తొలి ఇన్నింగ్స్లో బ్రిటన్ 117 పరుగులు చేయగా.. ఫ్రాన్స్ 78 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ను 145/5 వద్ద బ్రిటన్ డిక్లేర్ చేసింది. ఛేదనలో ఫ్రాన్స్ 26 పరుగులకే కుప్పకూలడంతో బ్రిటన్ 158 పరుగుల తేడాతో నెగ్గింది. అప్పుడు బ్రిటన్కు రజతం, ఫ్రాన్స్కు కాంస్యం అందించారు. ఆ తర్వాత వీటిని పసిడి, రజత పతకాలుగా మార్చారు.