న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలనే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేస్తున్నట్లు ఐఓసీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. క్రికెట్తో పాటు ఫ్లాగ్ ఫుట్బాల్, బేస్బాల్, సాఫ్ట్బాల్ ఆటకు సైతం ఐఓసీ ఆమోద ముద్ర వేసింది.
ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు ఫుట్బాల్, బేస్బాల్, సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, స్క్వాష్, లాక్రోస్ క్రీడలను చేర్చినట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. క్రికెట్ను భాగం చేయాలని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ చేసిన ప్రతిపాదనను అంగీకరించినట్లు చెప్పారు.

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. క్రికెట్ను చేర్చడం ద్వారా ఒలింపిక్స్ ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు టోర్నీని మరింత విస్తృత పర్చవచ్చని ఐఓసీ భావించింది. ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్లో పురుషుల, మహిళల టీ-20 క్రికెట్ను భాగం చేశారు.
2024 పారిస్ ఒలింపిక్స్ ప్రసార హక్కులు రూ.158.6కోట్లు కాగా.. క్రికెట్ను చేరిస్తే 2028 నాటికి ప్రసార హక్కులు రూ.1,525 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 1900 పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ భాగంగా ఉంది. కానీ ఆ తర్వాతి నుంచి ఈ ఆటను పక్కన పెట్టేసారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో ప్రతీ ఒలింపిక్స్ ముందు క్రికెట్ను చేర్చాలనే డిమాండ్ వ్యక్తమైంది.
ఆసీయా క్రీడల చరిత్రలో తొలిసారి క్రికెట్ మ్యాచ్లను నిర్వహించారు. ఒలింపిక్స్ తర్వాత అంతటి పెద్ద ఈవెంట్ అయిన ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చడంతో ఒలింపిక్స్లో ఈ ఆటను ఆడించేందుకు మార్గం సుగమమైంది. కామన్వెల్త్ క్రీడల్లోనూ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు.
క్రికెట్ సుదీర్ఘంగా సాగే ఆటని, మైదానాలు సిద్దం చేయాలి, ఖర్చు ఎక్కువ అనే భావనతో ఐరోపా దేశాలు ఇన్నాళ్లు పెద్దగా ఆసక్తికనబర్చలేదు. దాంతో ఐఓసీ క్రికెట్ను ఇన్నాళ్లు పరిగణలోకి తీసుకోలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఉన్న క్రేజ్తో పాటు ఆ ఆటలో వచ్చిన మార్పులు, సృష్టిస్తున్న ఆదాయంతో ఐఓసీ క్రికెట్ను ఒలింపిక్స్లో భాగం చేసేందుకు సిద్దమైంది.
లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్ భాగమైన నేపథ్యంలో భారత్కు రెండు పతకాలు ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పురుషుల, మహిళల జట్లు కనీసం కాంస్య పతకాన్ని అయినా గెలుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.