టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా ఘోర పరాజయాలకు గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలే కారణమని మండిపడుతున్నారు. హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. హెడ్ కోచ్గా గంభీర్ పర్యవేక్షణలో భారత్ ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ ఓటమి దిశగా సాగుతోంది.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా.. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ సిరీస్ ఆడింది. రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో అనూహ్యంగా 3-0తో రోహిత్ సేన క్లీన్ స్వీప్ అయ్యింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడం ఇదే తొలిసారి. ఆ సిరీస్ సమయంలోనే గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో టీమిండియా కోల్పోయింది. ఈ సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత మూడు మ్యాచ్లు ఓడి ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఈ పరాజయలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను దక్కించుకోలేకపోయింది. ఈ సిరీస్ అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవడంతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ ఒక్క గెలుపు.. అతని వైఫల్యాలను కప్పిపుచ్చింది. అంతేకాకుండా ఈ విజయం తర్వాత టీమిండియాపై అతని ఆధిపత్యం ఎక్కువైంది.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు జట్టు ప్రక్షాళన చేపట్టిన గంభీర్.. సీనియర్ ఆటగాళ్లు తప్పుకునేలా పావుల కదిపాడని వార్తలు వచ్చాయి. గంభీర్ సూచనలతోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లు ఇప్పటికి ప్రచారం జరుగుతోంది. రోహిత్ వారసుడిగా శుభ్మన్ గిల్ను టెస్ట్ కెప్టెన్గా ఎంపిక చేశారు. తన మాట వింటాడనే గంభీర్.. శుభ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జట్టు సెలెక్షన్ నుంచి మైదానంలో అమలు చేసే వ్యూహాల వరకు అన్నింటిలోనూ గంభీర్ జోక్యం చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పదే పదే డ్రెస్సింగ్ రూమ్ నుంచి సందేశాలు పంపించడం టీవీలో కూడా కనిపిస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనలో తొలి రెండు టెస్ట్ల్లో స్వింగ్ కింగ్ అయిన అర్ష్దీప్ సింగ్ బదులు ప్రసిధ్ కృష్ణను బరిలోకి దించడం వెనుక గంభీర్ ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్కు కూడా గంభీర్ ఉద్దేశపూర్వకంగానే అవకాశం ఇవ్వడం లేదని అతని చిన్ననాటి కోచ్ ఆరోపించాడు. ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై ముఖేష్ కుమార్ కూడా బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. గంభీర్ తప్పిదాలను మాజీ క్రికెటర్లు కూడా ఎత్తి చూపుతున్నారు. కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ అతి జోక్యం కారణంగా శుభ్మన్ గిల్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని చెబుతున్నారు. ఏది ఏమైనా గంభీర్ నిర్ణయాలతో ఫ్యాన్స్ చికాకుకు గురవుతున్నారు. ఇంగ్లండ్తో టీమిండియా సిరీస్ కోల్పోతే.. గంభీర్ను టెస్ట్ ఫార్మాట్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.