హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత అభిమానులకు నిరాశే మిగులుతోంది. పసలేని మ్యాచ్లతో చికాకు పుడుతోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు జరగ్గా.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ హోరాహోరీగా సాగలేదు. 13 మ్యాచ్లు 13 ఏకపక్షంగా ముగిసాయి. ఒక్క మ్యాచ్ కూడా 100 ఓవర్ల పాటు జరగలేదు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్తో మొదలు ఆదివారం జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచ్ వరకు అన్నీ ఏకపక్షంగానే ముగిసాయి. కాస్తో కూస్తో శ్రీలం, పాకిస్థాన్ మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఈ ఒక్క మ్యాచ్లోనే అత్యధిక ఓవర్ల ఆట సాగింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ శ్రీలంక పేలవ బౌలింగ్ అభిమానులకు చికాకు తెప్పించింది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్-ఆస్ట్రేలియా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు సైతం ఏకపక్షంగా ముగిసాయి. భారత బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు 200 పరుగులు కూడా చేయలేకపోయాయి. ముఖ్యంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దాయాదుల సమరం.. అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 150/2 స్కోర్తో పటిష్టంగా కనిపించిన ఆ జట్టు 191 పరుగులకే కుప్పకూలడం అందర్నీ విస్మయ పరిచింది. అనంతరం టీమిండియా అలవోకగా 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఈ భారత్-పాక్ మ్యాచ్ అత్యంత చెత్త పోరుగా నిలిచిపోయింది. వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై టీమిండియా కు ఓటమి లేకున్నా.. గత ఏడు మ్యాచ్లు హోరాహోరీగా సాగి అభిమానులను అలరించాయి. 2003, 2011లో భారత్-పాకిస్థాన్ జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి.
టీ20 ఫార్మాట్లకు అలవాటు పడ్డ ఆటగాళ్లు.. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. ఓపికగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. దంచికొట్టమే లక్ష్యంగా చెలరేగుతూ వికెట్లు పారేసుకుంటున్నారు. దాంతో మ్యాచ్ పూర్తిగా సాగకుండానే ఫలితం వస్తోంది. కనీసం ముందు ముందైనా హోరాహోరీ మ్యాచ్లు జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.