సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ మ్యాచ్లో తమ ఓటమికి టెంబా బవుమా- కార్బిన్ బోష్ అద్భుతమైన భాగస్వామ్యమే కారణమని టీమిండియా తాత్కలిక సారథి రిషభ్ పంత్ తెలిపాడు. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా ఈ భాగస్వామ్యమే తమ విజయానికి బాటలు వేసిందని చెప్పాడు.
అయితే రిషభ్ పంత్ చెత్త కెప్టెన్సీతోనే ఈ భాగస్వామ్యం నమోదైందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 93/7 ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కింది. అయితే పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో కాకుండా రిషభ్ పంత్.. స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. దాంతో ఓవర్నైట్ బ్యాటర్లు అయిన టెంబా బవుమా, కార్బిన్ బోష్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ చేశారు.

7 ఓవర్ల తర్వాత బుమ్రాను బరిలోకి దించాడు. దాంతో సఫారీ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే ఒక ఎండ్లో బుమ్రాతో వేయిస్తూ మరో ఎండ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పంత్ బౌలింగ్ కొనసాగించాడు. చివరకు కార్బిన్ బోష్ను బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 8వ వికెట్కు 44 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా స్పిన్నర్లను ఈజీగా ఆడుతుండటంతో సిరాజ్ను తీసుకొచ్చిన పంత్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ఒకే ఓవర్లో సిరాజ్ చివరి రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికా ఇన్నింగ్స్కు తెరదించాడు. మూడో రోజు ఆట ప్రారంభంలోనే బుమ్రా, సిరాజ్తో ఆరంభ ఓవర్లు వేయించి ఉంటే బవుమా-బాష్ భాగస్వామ్యం నమోదయ్యేది కాదని, పంత్ చేసిన తప్పిదం టీమిండియా పతనాన్ని శాసించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మెడనొప్పితో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు దూరమవ్వడం కూడా జట్టు ఓటమికి కారణమైందని చెబుతున్నారు. రెండు ఇన్నింగ్స్ల్లో అతను బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, అతని కెప్టెన్సీ కూడా జట్టుకు కలిసొచ్చేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా 124 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఛేదించాల్సిందని, మరోసారి స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేని బలహీనతను భారత్ బయటపెట్టుకుందని విమర్శిస్తున్నారు.