టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఐపీఎల్ 2025 సీజన్ ఆడకుండా నిషేధం విధించాలని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సూచిస్తున్నారు. భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మరోవైపు టీమిండియా టెస్ట్ కెప్టెన్గా కొనసాగాలన్నా.. సుదీర్ఘ కాలం సంప్రదాయక ఫార్మాట్ ఆడాలన్నా బుమ్రా.. ఐపీఎల్కు దూరంగా ఉండి ఫిట్నెస్ కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 5 టెస్ట్ల్లో 9 ఇన్నింగ్స్ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్లో టీమిండియా 1-3తో ఓటమిపాలైనా బుమ్రా అసాధారణ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. బౌలర్గానే కాకుండా కెప్టెన్గా సత్తా చాటాడు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియాకు సారథ్యం వహించిన బుమ్రా.. అద్భుత కెప్టెన్సీతో విజయాన్నందించాడు. చివరి టెస్ట్లోనూ కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా దురదృష్టవశాత్తు వెన్ను నొప్పితో మ్యాచ్ మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. లేకుంటే ఈ మ్యాచ్లో కూడా టీమిండియాను గెలిపించేవాడు. బుమ్రా అద్భుత కెప్టెన్సీ నేపథ్యంలో అతన్ని టెస్ట్ కెప్టెన్గా నియమించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
అయితే బుమ్రా తరుచూ గాయాలబారిన పడుతుండటం ఇప్పుడు సమస్యగా మారింది. ఫుల్టైమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా తరుచూ గాయాలబారిన పడితే టీమిండియాకు తీవ్ర నష్టం చేయనుంది. ఈ క్రమంలోనే బుమ్రా.. ఐపీఎల్కు దూరంగా ఉండి ఫిట్నెస్ కాపాడుకోవాలని క్రికెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్లో వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా ఫిట్నెస్పై స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా అతను దూరంగా ఉండనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే బుమ్రా వెన్ను గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తాజాగా వార్తలు వచ్చాయి. అదే జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు కష్టాలు తప్పవు.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుండగా.. టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో భారత్ తలపడనుంది.