హైదరాబాద్: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా ఆట తీరును విమర్శిస్తున్నారు. వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 2-3తో ఓడిపోవడంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్.. హార్దిక్ పాండ్యా అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ ఓటమి ఎదురైందని భావిస్తున్నారు.
మాజీ క్రికెటర్లు సైతం హార్దిక్ పాండ్యా కెప్టెన్గా.. ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడని మండిపడుతున్నారు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ ముందు హార్దిక్ పాండ్యా ఆట తీరు ఆందోళన కలిగించేలా ఉందని మాజీ ఓపెసర్ వసీమ్ జాఫర్ అన్నాడు. ఈ సిరీస్లో హార్దిక్ పాండ్యా చాలా అసౌకర్యంగా కనిపించాడని తెలిపాడు.

'హార్దిక్ పాండ్యా అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది. క్రీజులోనూ స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. సిక్స్లు కొట్టకపోయినా కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేదు. వెస్టిండీస్తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. కానీ కీలకమైన ఐదో టీ20లో మాత్రం ఆ తరహా ఇన్నింగ్స్ను ఆడ లేకపోయాడు.
ఆసియా కప్, వన్డే ప్రపంచకప్లో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతని వైఫల్యం ఆందోళనకు గురి చేస్తోంది.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా అనాలోచిత నిర్ణయాలతోనే టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైందని మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు.
బ్యాటింగ్ చేసే వారితో బౌలింగ్.. బౌలింగ్ చేసే వారితో బ్యాటింగ్ చేయిస్తే ఇలాంటి పరాజయాలే ఎదురవుతాయన్నాడు. 'టీమిండియా ఆటగాళ్లు నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలి. ఆటగాళ్లలో పట్టుదల, తీవ్రత లోపించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనాలోచిత నిర్ణయాలు జట్టు విజయవకాశాలను దెబ్బతీసాయి.
ఇష్టమైన ఆటగాళ్లనే ఆడిస్తా అంటే కుదురదు. జట్టు విజయం కోసం కావాల్సిన ఆటగాళ్లను ఆడించాలి. ఇప్పటికైనా అంతర్మథనం చేసుకోవాలి.'అని ట్విటర్ వేదికగా వెంకటేశ్ ప్రసాద్ విమర్శించాడు. అభిమానులు సైతం కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ చేస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాపై ఫన్నీమీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'కుర్చి మడత పెట్టి..' అనే సోషల్ మీడియా వైరల్ డైలాగ్తో హార్దిక్ను హెచ్చరిస్తున్నారు.