
సిడ్నీ: ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్ను విజయవంతంగా నిర్వహించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా సాఫీగానే సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు సీఏ.. ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడగా.. పలు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు రద్దయ్యాయి. అయితే.. అక్టోబర్లోపు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంచనా వేసిన సీఏ.. షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్కప్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్కు ఇటీవల కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతని నమూనాల్ని పరీక్షించగా.. నెగటివ్ అని తేలిన విషయం తెలిసిందే.
'కొన్ని వారాల్లోనే క్రికెట్ సిరీస్లు అన్నీ మొదలవుతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికే పరిస్థితిని మా వైద్య నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్టోబర్- నవంబర్ నాటికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఎలా చూసినా.. షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్కప్ జరగడం ఖాయం. మెల్బోర్న్ వేదికగా నవంబరు 15న టోర్నీ ఫైనల్ జరగనుండగా.. ఆ మ్యాచ్కి స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయేలా ప్లాన్ చేస్తున్నాం' అని సీఏ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించాడు.
మెల్బోర్న్ స్టేడియం సీట్ల సామర్థ్యం 1,00,024కాగా.. ఇటీవల ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్కు 86,174 మంది అభిమానులు హాజరైన విషయం తెలిసిందే. మహిళల క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఓ మ్యాచ్కి హాజరవడం ఇదే తొలిసారి. కానీ.. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాలోని అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు అయ్యాయి.