
సిడ్నీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్ట్ షెడ్యూల్ ప్రకారం సిడ్నీలోనే జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం ప్రకటించింది. దాంతో మూడో టెస్ట్ను మెల్బోర్న్లోనే నిర్వహిస్తారన్న ఊహాగానాలకు తెరదించింది. అద్భుతంగా జరుగుతున్న ఈ టెస్టు సిరీసు షెడ్యూలు, వేదికలను మార్చే ఉద్దేశం లేదని వెల్లడించింది.
మెల్బోర్న్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 1-1తో సమం చేసింది. ఇందులో భాగంగానే జనవరి 7న సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్-19 కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తున్న వారిపై ఇతర రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. వారి ప్రవేశాలపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా మూడో టెస్టు తర్వాత బ్రిస్బేన్ వెళ్లేందుకు ఆటగాళ్లకు కష్టమవుతుందని భావిస్తున్నారు.
'కొవిడ్-19 మహమ్మారి వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ సిరీస్ల షెడ్యూలును యథాతథంగా నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కట్టుబడి ఉంది. సిడ్నీలో ప్రజారోగ్య పరిస్థితులు, సరిహద్దు ప్రవేశ ఆంక్షల గురించి మేం నిరంతరం చర్చిస్తున్నాం. సిడ్నీలో మూడు, బ్రిస్బేన్లో నాలుగో టెస్టు సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించడంపై మేం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ స్పష్టం చేశారు.