వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ ఆడే ఆస్ట్రేలియా జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. గాయంతో జట్టుకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కామెరూన్ గ్రీన్, జోష్ హజెల్ వుడ్ తిరిగి టెస్ట్ టీమ్లోకి వచ్చారు. స్పిన్నర్ మ్యాట్ కునెమన్ కూడా తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. బ్రెండన్ డగెట్ ట్రావెలింగ్ రిజర్వ్ ఎంపికయ్యాడు.
భారత్తో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1తో సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 19 మ్యాచ్ల్లో 13 విజయాలు,67.54 విన్నింగ్ పర్సంటేజీతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. 12 టెస్ట్ల్లో 8 విజయాలతో 69.44 విన్నింగ్ పర్సంటేజీతో సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఇరు జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 మధ్య లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్ 2025 టోర్నీలో పాల్గొనడం సందేహంగా మారింది. ముఖ్యంగా జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్.. భారత్కు తిరిగిరావడంపై సందేహాలు నెలకొన్నాయి. ఐపీఎల్కు దూరంగా ఉండే ఆసీస్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు అండగా ఉండాలని నిర్ణయించింది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో శనివారం నుంచి ఐపీఎల్ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రీషెడ్యూల్ను సోమవారం రాత్రి వెల్లడించింది.
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.
ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్