న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత్లో లాక్డౌన్ పొడిగించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్- నవంబర్ మధ్యలో టోర్నీ నిర్వహించే అవకాశాలను బోర్డు పెద్దలు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)కు ఐపీఎల్ అడ్డొస్తుందేమోనని ఆ లీగ్ వర్గాలు భావిస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం సీపీఎల్ ఆగస్టు-19 నుంచి సెప్టెంబర్ 26 మధ్య జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారమే సీపీఎల్ జరుగుతుందని ఈ లీగ్ సీఈవో పీట్ రసెల్ తెలిపారు. ఐపీఎల్తో తాము ఫైట్ చేయలేమని, తమ లీగ్ కోసం బీసీసీఐ సొంత విండోను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
'మేం ఐపీఎల్కు వ్యతిరేకంగా వెళ్లాలని అనుకోవడం లేదు. కానీ ఇలాంటి విషయాల్లో బీసీసీఐ చాలా పవర్ ఫుల్ అని నాకు తెలుసు. అయితే, ప్లేయర్లు, మిగతా లీగ్ల దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్పై నిర్ణయం తీసుకోవాలి. తమ టోర్నీలో వెస్టిండీస్ ప్లేయర్లందరూ ఆడాలని ఐపీఎల్ కచ్చితంగా కోరుకుంటుంది.
చాలా మంది కరీబియన్ స్టార్లు మాతో ఆడుతారు కాబట్టి సీపీఎల్ జరిగే టైమ్లో ఈ టోర్నీని నిర్వహించాలనుకోవడంలో అర్ధం ఉండదు. అలా జరిగితే లీగ్ లక్ష్యం ఓడిపోతుంది. అందువల్ల బీసీసీఐ ఆ పని చేయదని అనుకుంటున్నా. ఐపీఎల్ కోసం బీసీసీఐ సొంత విండోనే వెతుక్కుంటుందని నా నమ్మకం'అని పీట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు.