హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలిచిన అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రాయుడు తప్పుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి బరిలోకి దిగుతున్నట్లు హింట్ ఇచ్చాడు. అందుకు అనుగుణంగా పొలిటికల్ పిచ్పై ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు.
గత మూడు నెలలుగా గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించాడు. పొలిటికల్ కెరీర్పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టేందుకు అంబటిరాయుడు సిద్దమయ్యాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. ఈ నెల ఆఖరిలో వెస్టిండీస్ గడ్డపై జరగనున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భాగం కాబోతున్నట్లు రాయుడు తెలిపాడు.

సెయింట్ కిట్స్ అండర్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతనిథ్యం వహించనున్నాడు. ఫలితంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న రెండో భారత ప్లేయర్గా రాయుడు రికార్డులకెక్కనున్నాడు. అంతకుముందు 2020 సీజన్లో భారత స్పిన్నర్ ప్రవీణ్ తాంబే టిన్బాగో నైట్రైడర్స్ తరఫున ఆడాడు.
ఇక బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ రాయుడికి అడ్డంకిగా మారనుంది. ఈ రూల్ ప్రకారం భారత క్రికెట్కు గుడ్బై చెప్పిన ఆటగాళ్లు ఏడాది పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్లో భాగం కాకూడదు. భారత ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్స్ మోజులో పడకూడదనే బీసీసీఐ ఈ నిబంధనను కొత్తగా ప్రవేశపెట్టింది.
అయితే ఈ రూల్ను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ రూల్ కారణంగానే అంబటి రాయుడు అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో భాగమవ్వలేదు. లేకుంటే టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేవాడు. ఇక సీపీఎల్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని రాయుడు తెలిపాడు.