
బస్సెటెర్రె: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2021 ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. సెయింట్ లూసియా కింగ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పాట్రియోట్స్ మధ్య జరుగుతున్న మెగా పోరులో ఒక్క ఓవర్ ఆట కూడా పూర్తవ్వకుండానే అర్థంతరంగా నిలిచిపోయింది. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన సెయింట్ లుసియా కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్, భారీ కాయుడు రకీమ్ కార్న్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. సెయింట్ కిట్స్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ తొలి ఓవర్ వేసేందుకు ముందుకు వచ్చాడు. నాలుగో బంతిని ఫ్లెచర్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు.
ఆ మరుసటి బంతికి స్టెప్ ఔటై కవర్ పాయింట్ దిశగా ఆడగా రెండు పరుగులు వచ్చాయి. ఆ వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మ్యాచ్ ప్రారంభమయ్యేవరకు వాతావరణం అనుకూలంగా ఉండగా.. ప్రారంభమైన వెంటనే అనూహ్యంగా వర్షం రావడంతో అంతా అవాక్కయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది కవర్లతో పిచ్ను కప్పెసారు. ఇక వర్షం కొద్దిసేపటి తర్వాత ఆగిపోగా.. కవర్లపై నీళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాటిని తీసేందుకు మైదాన సిబ్బంది కృషిచేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే మ్యాచ్ పున:ప్రారంభం కానుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను కొన్ని ఓవర్లపాటు కుదించే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్కు సెయింట్ కింగ్స్ టీమ్లో ఒక మార్పు చోటు చేసుకుంది. అలెన్ స్థానంలో కెస్రిక్ విలియమ్స్ జట్టులోకి వచ్చాడు. ఇక నేవిస్ పాట్రియోట్స్ జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సెయింట్ లూసియా కింగ్స్ టీమ్ ప్రధాన ఆటగాడైన ఫాఫ్ డూప్లెసిస్ కీలక ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. గజ్జ గాయంతో ఇబ్బంది పడుతున్న అతను ఫైనల్ గ్రూప్ స్టేజి మ్యాచ్లతో పాటు నాకౌట్ మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. దాంతో అతను ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్లు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
మంగళవారం గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియెట్స్ ఘన విజయాన్ని సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. గయానా విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని సెంట్ కిట్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (39 బంతుల్లో 77 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసానికి తోడూ క్రిస్ గేల్ (27 బంతుల్లో 42, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బ్రేవో 31 బంతుల్లో 34,3 ఫోర్లు, 1 సిక్సర్) తోడవ్వడంతో సునాయాసంగా విజయం సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ 9 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (45, 20 బంతులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 27, హేమరాజ్ చంద్రపాల్ 27 పరుగులు చేశారు.
ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్ గెలిచి ఫైనల్ చేరింది. ఈ మ్యాచులో మొదటగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. మార్క్ డెల్ (44 బంతుల్లో 78, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రోస్టన్ చేజ్ (21 బంతుల్లో 36, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వీస్ (21 బంతుల్లో 34, 1 ఫోర్, 4 సిక్సర్లు), టీమ్ డేవిడ్ (17 బంతుల్లో 38, 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. భారీ లక్ష్య చేధనల ట్రిన్బాగో 18.3 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది. సునీల్ నరైన్ (30) టాప్ స్కోరర్. మున్రో (28), రాందిన్ (29), బ్రావో (25), పొల్లార్డ్ (26) నిరాశపరిచారు.