
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2020 సీజన్కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ట్రినిడాడ్ వేదికగా గత సీజన్ రన్నరప్ గయాన అమేజాన్ వారియర్స్, త్రీ టైమ్ చాంపియన్ ట్రినిబాగో నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మోస్ట్ వెయిటింగ్ మ్యాచ్కు బ్రియాన్లారా స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.
అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్న ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్లో అమెజాన్ వారియర్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. లీగ్ స్టాయిలో 10కి 10 మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు.. ఫైనల్లో మాత్రం బార్బోడస్ ట్రైడెంట్స్ చేతిలో 27 పరుగులతో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. చందర్ పాల్ హేమ్ రాజ్, బ్రెండన్ కింగ్, షిమ్రన్ హెట్మైర్, న్యూజిలాండ్ దిగ్గజం రాస్ టేలర్, నికోలస్ పూరన్, కీమో పాల్తో 8వ స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. అయితే పాకిస్థాన్ ప్లేయర్లు షోయబ్ మాలిక్, షాదాబ్ ఖాన్ ఈ సీజన్లో అందుబాటులో లేకపోవడం మాత్రం ప్రతికూలాంశం.
ఇక లీగ్లోఅత్యధికంగా మూడు సార్లు టైటిల్ నెగ్గిన ట్రినిబాగో నైట్ రైడర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. సునీల్ నరైన్, లెండీ సిమ్మన్స్, కొలిన్ మున్రోలతో విధ్వంసకర టాపార్డర్ కలిగి ఉంది. అంతేకాకుండా టీ20 ఫార్మాట్ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం ఆ జట్టుకు కలుసొచ్చే అంశం. కీరన్ పోలార్డ్ ఈ జట్టును నడిపిస్తుండగా.. భారత ఆటగాడు ప్రవీణ్ తాంబే ఈ జట్టు తరఫునే బరిలోకి దిగుతున్నాడు. సునీల్ నరైన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇరు జట్లు మొత్తం 5 సార్లు తలపడగా.. వారియర్సే అత్యధికంగా 4 సార్లు గెలవగా.. నైట్ రైడర్స్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.
జట్లు అంచనా:
ట్రినిబాగో నైట్ రైడర్స్: కీరన్ పోలార్డ్(కెప్టెన్), లెండీ సిమ్మన్స్, కొలిన్ మున్రో, డారేన్ బ్రేవో, టిమ్ సీఫర్ట్(కీపర్), డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, ఖారీ పిర్రే, జైడేన్ సీలెస్, ప్రవీణ్ తాంబే, అండర్సన్ ఫిలిప్
గయాన అమెజాన్ వారియర్స్: క్రిస్ గ్రీన్(కెప్టెన్), బ్రాండన్ కింగ్, చందర్ పాల్ హేమరాజ్, రాస్ టేలర్, షిమ్రన్ హెట్మైర్, నికోలస్ పూరన్(కీపర్), ఒడేన్ స్మిత్, కీమో పాల్, ష్రెఫెన్ రూథర్ఫర్డ్, ఇమ్రాన్ తాహిర్, రొమారియో షెఫర్డ్