
ట్రినిడాడ్: వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ కిడ్నీ స్టోన్స్ సమస్యతోనే సీపీఎల్లో గత మూడు మ్యాచ్లకు దూరమయ్యాడని ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తెలిపాడు. ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న నరైన్.. సీపీఎల్ 2020 సీజన్ను రెండు హాఫ్ సెంచరీలతో ఘనంగా ప్రారంభించాడు. అటు బంతితోనూ మెరిసాడు. అయితే ఉన్నపళంగా గత మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. అతన్ని పక్కన పెట్టడానికి గల కారణాలను కూడా టీమ్మెనేజ్మెంట్ వెళ్లడించలేదు. అయితే తాజాగా జమైకా తల్లవాస్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు కోచ్ మెక్కల్లమ్ అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ.. సునీల్ నరైన్ కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడ్డాడని, వాటిని తొలగించడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
'సునీల్ నరైన్ కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడ్డాడు. దాంతో వైద్యులు వాటిని తొలగించారు. అప్పటి నుంచి నరైన్ బాగున్నాడు. నిన్న అతనికిష్టమైన ఫుట్బాల్ కూడా ఆడాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే లక్ష్యంతోనే ఈ రోజు మ్యాచ్ బరిలోకి దిగాడు. మనం కూడా అతని నుంచి గొప్ప పెర్ఫామెన్స్ చూడాలని ఆశిద్దాం. ఈ సీజన్ను అతను అద్భుతంగా ప్రారంభించాడు. ముఖ్యంగా ఇలాంటి పిచ్లపై అతను చెలరేగుతాడని మనందరికి తెలిసిందే'అని మెక్కల్లమ్ చెప్పుకొచ్చాడు. ఇక ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుదేనన్న విషయం తెలిసిందే. అందుకే కోల్కతా కోచ్ అయిన మెక్కల్లమ్ సీపీఎల్లో ట్రిన్ బాగో నైట్రైడర్స్కు కూడా తన సేవలందిస్తున్నాడు. నరైన్ కూడా చాలా ఏళ్లుగా కోల్కతా తరఫున ఆడుతున్నాడు. అతని సూపర్ ఫామ్లో కోల్కతాకు కలిసి రానుంది.
ఇక జమైకా తల్లవాస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 29 పరుగులు చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక నైట్ రైడర్స్ జట్టులో కొలిన్ మున్రో(65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ పొలార్డ్ (16 బంతుల్లో 2 సిక్స్లు, 1 ఫోర్తో 33 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో భారత క్రికెటర్ ప్రవీణ్ తాంబేకు అవకాశం దక్కలేదు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జమైకా తల్లవాస్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులే చేయడంతో 19 పరుగులతో నైట్ రైడర్స్ ఘన విజయాన్ని అందుకుంది. ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తుంది.