
ట్రినిడాడ్: కరీబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్లో గత సీజన్ రన్నరప్ గయాన అమెజాన్ వారియర్స్కు గట్టి షాక్ తగిలింది. సెయింట్ లూసియా జౌక్స్తో సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లీగ్లో గయానకు ఇది రెండో పరాజయం కాగా సెయింట్ లూసియాకు మూడో విజయం.
బ్యాటింగ్లో ఆ జట్టు బ్యాట్స్మన్ రోస్టన్ ఛేజ్(51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 66)విధ్వంసం సృష్టించగా.. బౌలింగ్లో స్కాట్ కుగ్గెలీజ్న్ (3/24) ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను చెడుగుడు ఆడటంతో సెయింట్ లూసియా అలవోక విజయాన్నందుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్కు అండగా.. మహ్మద్ నబీ(27) రాణించాడు. అనంతరం ఛేజింగ్కు దిగిన గయాన అమెజాన్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (49 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్తో 69) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
కీమో పాల్(20) ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. సెయింట్ లూసియా బౌలర్లలో కుగ్గెలిజ్న్కు మూడు వికెట్లు దక్కగా.. చెమర్ హోల్డర్, కెస్రిక్ విలియమ్స్లకు రెండేసి వికెట్లు దక్కాయి. నికోలస్ పోరాటంతో గెలుపు దిశగా వచ్చిన ఆ జట్టు చివరి ఓవర్లో 13 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వేసిన చెమర్ హోల్డర్ రెండు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.
ఇక అఫ్గాన్ ప్లేయర్ మహ్మద్ నబీ ఓ వికెట్ తీశాడు. సీపీఎల్లో నబీ ఆల్రౌండ్షోతో అదరగొడుతున్నాడు. అటు బ్యాటింగ్లో విలువైన పరుగులు చేస్తూ.. బౌలింగ్లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే గత రెండు మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన ఛేజ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.