
ట్రినిడాడ్: కరోనా అనంతరం అభిమానులకు కావాల్సిన అసలు సిసలు టీ20 రుచిని చూపించాడు వెస్టిండీస్ క్రికెటర్ కైల్ మేయర్స్.! కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్లో బార్బోడస్ ట్రిడెంట్స్ తరఫున ఆడుతున్న ఈ విండీస్ వీరుడు.. బుధవారం జమైకా తల్లవాస్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 8 సిక్లర్లు, 3 ఫోర్లతో 89 పరుగులు చేసిన కైల్.. మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు.
ప్రత్యర్థి కార్లోస్ బ్రాత్ వైట్ బౌలింగ్ను చితక్కొట్టాడు. అతను వేసిన 18 ఓవర్లో నాలుగు సిక్స్లు, ఒక ఫోర్తో మొత్తం 28 పరుగులు పిండుకున్నాడు. కైల్ విధ్వంసానికి తోడుగా.. బౌలర్లు రషీద్ ఖాన్(2/33), జాస్ హోల్డర్(2/18), మిచెల్ సాంట్నర్ (2/10) రాణించడంతో బార్బోడస్ ట్రిడెంట్స్ 36 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో హ్యాట్రిక్ ఓటములకు ఫుల్ స్టాప్ పెట్టిన బార్బోడస్ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలిచింది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బార్బోడస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 రన్స్ చేసింది. మేయర్స్(85)కు తోడుగా మిచెల్ సాంట్నర్(20 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్(3/14), సందీప్ లమిచ్చేన్(2/16) రాణించారు. అనంతరం ఛేజింగ్కు దిగిన జమైకా తల్లవాస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బొన్నెర్(31), బ్లాక్ వుడ్(28) టాప్స్కోరర్లుగా నిలిచాడు. ఈ మ్యాచ్లో విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్ ఆడలేదు. విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్న కైల్ మేయర్స్కు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ దక్కింది.