
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 సీజన్ రెండో సెమీఫైనల్ చాలా దారుణంగా జరిగింది. అసలు ఇది సెమీఫైనల్ మ్యాచేనా? అనే సందేహం అభిమానులకు కలిగింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో కనీసం పోరాట పటిమ కనబర్చని గయాన అమెజాన్ వారియర్స్.. సెయింట్ లూసియా జౌక్స్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ ఫలితంపై అభిమానుల సోషల్ మీడియా వేదికగా పెదవి విరుస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన డిఫెండింగ్ చాంపియన్ గయాన అమెజాన్ వారియర్స్ ఆశ్చర్యకరంగా 13.4 ఓవర్లలోనే 55 పరుగులకు కుప్పకూలింది. సీపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యల్ప స్కోర్. ప్రత్యర్థి బౌలర్లు కుగ్లిజిన్(2/12), రోస్టన్ చేజ్ (2/15), మార్క్ దెయల్(2/2) ధాటికి గయాన బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. పరుగుల ఖాతా తెరవకుండానే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయిందంటే.. ఆ జట్టు బ్యాటింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రపాల్ హెమ్రాజ్ (25) టాప్ స్కోరర్ కాగా మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. నలుగురు బ్యాట్స్మన్ డకౌటయ్యారు. బ్రెండన్ కింగ్, షిమ్రాన్ హెట్మైర్, రొమారియో షెపెహెర్డ్, ఇమ్రాన్ తాహిర్ నలుగురు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. నికోలస్ పూరన్(11), క్రిస్ గ్రీన్(11), హేమ్రాజ్ మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ కూడా కనీసం రెండెంకెల స్కోరు చేయలేకపోయారు. అసలు ఇది టీ20 మ్యాచేనా? అనే సందేహం కూడా కలిగింది.
ఇక 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెయింట్ లూసియా జౌక్స్ 4.3 ఓవర్లలోనే పూర్తి చేసి ఘన విజయాన్నందుకుంది. ఆ జట్టు ఓపెనర్, భారీ కాయుడు రకీమ్ కార్న్వాల్(32 నాటౌట్), దెయల్(19 నాటౌట్) సాయంతో సూపర్ విక్టరీ అందించాడు. ఆల్రౌండ్షోతో అదరగొట్టిన దెయల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఈ గెలుపుతో సెయింట్ లూసియా సగర్వంగా టైటిల్ ఫైట్కు రెడీ అయింది. గురువారం ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగే తుదిపోరులో అమితుమీ తేల్చుకోనుంది.