
ట్రినిడాడ్: న్యూజిలాండ్ క్రికెటర్ గ్లేన్ ఫిలిప్స్(61 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్లో జమైకా తల్లవాస్ మూడో విజయాన్నందుకుంది. సెయింట్ కింట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన తల్లవాస్ 37 పరుగులతో ఘనవిజయాన్నందుకుంది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన తల్లవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 రన్స్ చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఫిలిప్స్ కడవరకు నిలవగా.. మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. బ్లాక్ వుడ్(27), అసిఫ్ అలీ(14), బోన్నర్(16) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఫిలిప్స్ ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాట్స్మన్ ఆండ్రూ రస్సెల్ ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. ప్రత్యర్థి బౌలర్లలో రయాద్ ఎమ్రిత్ మూడు వికెట్లు తీయగా.. షెల్డన్ కాట్రెల్, ఇష్ సోధి, ఇమ్రాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ 19.4 ఓవర్లలో 110 రన్స్కు ఆలౌటై ఓటమిపాలైంది. ఆ జట్టులో కిరన్ పోవెల్(21), ఎవిన్ లూయిస్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కార్లోస్ బ్రాత్ వైట్(3/11), సందీప్ లమిచ్చేన్(2/27), ఫిడెల్ ఎడ్వర్డ్స్(2/39) సెయింట్ కిట్స్ పతనాన్ని శాసించారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ తీసి ఇప్పటి వరకు జరిగిన ఈ సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టిన గ్లెన్ ఫిలిప్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.