
హైదరాబాద్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్లో ఆడేందుకు ట్రినిడాడ్, టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అఫిషియల్స్, ఆర్గనైజర్స్ అందరికి కరోనా నెగటీవ్ వచ్చిందని సీపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం బయో బబుల్ వాతావరణంలో క్వారంటైన్లో ఉన్న వీరందరికి వరుసగా రెండోసారి పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ ఫలితం వచ్చిందని తెలిపింది. దీంతో అన్ని జట్లకు ప్రాక్టీస్ ప్రారంభించవచ్చని సూచించింది. అయితే సీపీఎల్ అఫిషియల్స్, టీవీ క్రూ మాత్రం ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
'ఆరోగ్య మంత్రిత్వశాఖ, సీపీఎల్ మెడికల్ వైద్య సలహా కమిటీ ప్రొటోకాల్స్ మేరకు ట్రినిడాడ్, టొబాగోకు వచ్చే ముందే లీగ్లో భాగమయ్యే వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాం. నెగటీవ్ వచ్చిన తర్వాతే అనుమతించాం. ఈ చర్యలే మమ్మల్ని ఈ రోజు సేఫ్గా ఉంచాయి. అయితే ఇది టోర్నీలో ఆరంభం మాత్రమే. లీగ్ సక్సెస్ కోసం ఇదే స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తాం. ప్రస్తుత పరిస్థితికి కృషి చేసిన సీపీఎల్ సభ్యులందరికి కృతజ్ఞతలు'అని సీపీఎల్ 2020 టోర్నీ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ హాల్ తెలిపాడు.
ఇక ఇక్కడికి వచ్చే ముందే కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురుకి మాత్రం పాజిటివ్గా తేలింది. దీంతో వారితో పాటు వెస్టిండీస్ ఆల్రౌండర్ ఫాబియన్ అలెన్ సీపీఎల్ 2020 సీజన్కు దూరమయ్యారు. ఫాబియన్కు కరోనా లేనప్పటికీ.. ఫ్లైట్ మిస్సవ్వడంతో సీపీఎల్లో పాల్గొనే అవకాశం చేజారింది.
మరోవారం రోజుల్లో (ఆగస్టు 18న) సీపీఎల్ 2020 సీజన్కు తెరలేవనుంది. కరోనా నేపథ్యంలో ట్రినిడాడ్, టొబాగో రెండు వేదికలుగా ప్రేక్షకుల్లేకుండా అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి. గత సీజన్ రన్నరప్ గయాన అమేజాన్ వారియర్స్, త్రీటైమ్ చాంపియన్స్ ట్రినిబాగో నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్తో ఈ లీగ్ తెరలేవనుండగా.. ఫైనల్ సెప్టెంబర్ 10న జరగనుంది.