లండన్: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయావాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ 2023 ఆడుతున్న పుజారా.. ససెక్స్ టీమ్కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాళ్లు క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ జట్టుకు 12 డీమెరిట్ పాయింట్స్ విధించారు.
దాంతో టీమ్ కెప్టెన్ అయిన చతేశ్వర్ పుజారాపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిబంధనల ప్రకారం ఓ సీజన్లో ఒక జట్టు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొంటే టీమ్ కెప్టెన్ ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్లో ససెక్స్ టీమ్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలతో 12 డీమెరిట్ పాయింట్స్ పొందింది.

టోర్నీ తొలి దశలో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో మరో రెండు పెనాల్టీలను పొందింది. దాంతో ఎలాంటి వాదనలు లేకుండా కౌంటీ ఛాంపియన్షిప్ అధికారులు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తూ పుజారాపై చర్యలు తీసుకున్నారు.
లీసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వెలాస్లు గొడవ పడ్డారు.
ఈ ముగ్గురు ఆటగాళ్లపై కూడా అధికారులు నిషేధం విధించారు. విచారణ అనంతరం కార్వెలాస్పై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్షిప్లో ససెక్స్ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.
ససెక్స్ ఖాతాలో 124 పాయింట్లు ఉండగా.. కౌంటీ డివిజన్ 2 పోటీల్లో భాగంగా ససెక్స్ సెప్టెంబర్ 19-22 వరకు డెర్బీషైర్తో ఆడాల్సి ఉంది. 198 పాయింట్లతో డర్హమ్ టాప్లో ఉంది.