
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ను వాయిదా వేయాలంటూ వేసిన అత్యవసర పిల్ను సుప్రీకోర్టు గురువారం తిరస్కరించింది.
జస్టిస్ యూ యూ లలిత్, అనిరుద్ద బోస్లతో కూడిన వెకేషన్ బెంచ్ ఇప్పుడు ఈ పిటిషన్ను విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. హోలీ విరామం తర్వాత మార్చి 16న రెగ్యూలర్ బెంచ్ ముందు అత్యవసర పిల్గా ప్రస్తావించవచ్చని పిటిషనర్లకు సూచించింది.
'ఇది కోర్టు పున: ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేని అంశం అయితే కాదు. మార్చి 16న ఈ పిల్ను సాధారణ కోర్టు ముందు ప్రస్తావించవచ్చు'అని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మోహన్ బాబు అగర్వాల్కు ధర్మాసనం సూచించింది.
ఇక మార్చి 29న ఐపీఎల్ 2020 సీజన్కు తెరలేవబోతుందనీ, ఇప్పటి వరకు కరోనా వైరస్ ఎదుర్కోవడానికి తీసుకోవాల్సి జాగ్రత్తలు తీసుకోలేదని, ఇది సుమారు 40 వేల ప్రేక్షకుల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని అత్యవసరంగా విచారించాలని మోహన్ బాబు అగర్వాల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందని ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 'ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ వాయిదా వేయం. మ్యాచ్లు జరిగే వేళ కరోనా కట్టడికి అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని స్పష్టం చేశాడు. ఇక ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్ వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. శివసేన నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ టికెట్ల అధికారిక అమ్మకాలను నిషేధించింది.