పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన నేపథ్యంలో క్రికెటర్లకు లభించే ఆదరణ, సౌకర్యాలపై జోరుగా చర్చ జరుగుతోంది. క్రికెటర్లకు అందించే సౌకర్యాలను ఇతర క్రీడాకారులకు కల్పిస్తే.. ఒలింపిక్స్లో చైనా, అమెరికా, ఆస్ట్రేలియాలా భారత్ సత్తా చాటుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగంతో పాటు నగరంలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ కెరీర్ను ప్రారంభించిన సిరాజ్.. అసాధారణ ప్రదర్శనతో అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియాలో కీలక పేసర్గా మారాడు.

సిరాజ్ నెట్వర్త్.. రూ. 74 కోట్లు
ఈ క్రమంలో అతను ఆర్థికంగా కూడా చాలా బలపడ్డాడు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా తన టీమ్ (ఆర్సీబీ) ఆటగాళ్లందరినీ ఇంటికి ఆహ్వానించాడు. ప్రస్తుతం ఆర్థికంగా అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా సిరాజ్కు లేదు.
ఐపీఎల్లో ఒక్క సీజన్ రూ. 7 కోట్ల వేతనం అందుకుంటున్న సిరాజ్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల్లో ఏ గ్రేడ్లో ఉన్నాడు. ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది. మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు ప్రత్యేకం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ల ద్వారా లభించే నగదు బహుమతులు కూడా అదనమే. వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారా కూడా డబ్బులు ఆర్జిస్తున్నాడు. బిజినెస్ వెబ్సైట్స్ అంచనాల ప్రకారం మహమ్మద్ సిరాజ్ నెట్వర్త్ దాదాపు రూ. 74 కోట్లు.
ఉద్యోగం చాలు..
ఏడాదికి రూ. 20 కోట్లు వరకు సంపాదించే మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం 600 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వడం ఎందుకు? అని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చినందుకు గ్రూప్-1 ఉద్యోగంతో సత్కరించాలని, కానీ ఇంటి స్థలం కేటాయించడం ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు క్రికెటర్లకు ప్రభుత్వాలు ఏం చేయాల్సిన అవసరం లేదని, వారే ఆర్థికంగా బలపడగలరని ఇటీవల హైదరాబాద్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. సిరాజ్కు గ్రూప్-1 ఉద్యోగం, 600 గజాల ఇంటి స్థలం కేటాయించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజాలకు కూడా ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు.
సిరాజ్ తిరస్కరించాలి..
ఈ డిమాండ్పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాయుడు.. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదని స్పష్టం చేశాడు. మహమ్మద్ సిరాజ్ సైతం ఇలానే ప్రభుత్వం ఇచ్చే 600 గజాలు, గ్రూప్ 1 ఉద్యోగాన్ని తిరస్కరించాలని అభిమానులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఛాంపియన్లుగా ఎదిగిన తర్వాత నజరానాలు ప్రకటించే బదులు.. వారి కష్టాల్లో భాగమవ్వాలని సూచిస్తున్నారు.
క్రీడలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తు శుద్ది ఉంటే.. హాకీ ఇండియాను స్పాన్సర్ చేస్తున్న ఒడిశా ప్రభుత్వం తరహాలో ఏదైనా ఇతర క్రీడను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రతిభావంతమైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయాలంటున్నారు. క్రికెటర్లను తయారు చేసేందుకు బీసీసీఐ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, ప్రభుత్వాలు క్రికెట్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బీసీసీఐ నిర్ణయాలకు అండగా నిలిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.