టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ను తప్పించేందుకు కుట్ర జరుగుతుందా? భారత జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో వైట్వాష్కు గురైన తర్వాత నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా సొంతగడ్డపై మూడు టెస్ట్ల్లో ఓటమిపాలై వైట్వాష్కు గురైంది. దాంతో ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లు ఈ సిరీస్లో విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కోహ్లీ, రోహిత్ కుట్ర..?
ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. గౌతమ్ గంభీర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గంభీర్ను హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించేందుకే ఈ ఇద్దరూ న్యూజిలాండ్తో సిరీస్లో పరుగులు చేయలేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక బీజేపీ పార్టీ సన్నిహితులు, అభిమానులు ఈ వాదనను తెరపైకి తీసుకోచ్చారు.
కేంద్ర ప్రభుత్వ అండదండలతో గంభీర్ హెడ్ కోచ్గా నియమితుడయ్యాడనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటి వరకు ఏ కోచ్కు ఇవ్వని అధికారాలను గంభీర్కు ఇచ్చారు. సాధారణంగా జట్టు సెలెక్షన్ సమావేశాల్లో హెడ్ కోచ్ పాల్గొనరు. కానీ, గంభీర్కు మాత్రం అవకాశం కల్పించారు. టీమ్ సెలెక్షన్లో జోక్యం చేసుకునే పవర్స్ ఇచ్చారు.

గంభీర్కు ఫుల్ పవర్స్..
రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రికి కూడా ఈ వెసులుబాటు ఇవ్వలేదు. కానీ గంభీర్కు మాత్రం ఆ మినహాయింపు ఇచ్చారు. గతంలో కెప్టెనే జట్టుకు సుపీరియర్గా వ్యవహరించేవాడు. కానీ గంభీర్ రాకతో కెప్టెన్ను కూడా సాధారణ ఆటగాడిలానే మారిపోయాడనే వాదన వినిపిస్తోంది.
గంభీర్కు ఎక్కువ అధికారాలు ఇవ్వడాన్ని భారత ఆటగాళ్లతో పాటు కొందరు అధికారులు సహించలేకపోతున్నారని, అతన్ని హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కోహ్లీ 93.. రోహిత్ 91
న్యూజిలాండ్తో సిరీస్లో కోహ్లీ, రోహిత్.. గంభీర్పై కోపంతోనే ఔటయ్యారని వాదిస్తున్నారు. ఈ సిరీస్లో 6 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ 91 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 52 పరుగులు. నిర్లక్ష్యపు షాట్లతో రోహిత్ ఎక్కువ సార్లు ఔటయ్యాడు. మరోవైపు కోహ్లీ 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 93 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్లోనే 73 పరుగులు సాధించాడు. మిగతా ఐదు ఇన్నింగ్స్ల్లో కలిపి 20 పరుగులే చేశాడు.
ఈ గణంకాలే రోహిత్, కోహ్లీ.. ఉద్దేశపూర్వకంగా తమ వికెట్లను పారేసుకున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ కోచ్పై ఉన్న కోపంతో ఆటగాళ్లు తమ దేశానికి అన్యాయం చేస్తారా? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. కోచ్లను తప్పించేందుకు తమ కెరీర్లను ఫణంగా పెట్టుకోరు కదా?.
ఓటమిని జీర్ణించుకోలేకనే..
విజయాలు అలవాటైన టీమిండియా ఫ్యాన్స్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. న్యూజిలాండ్ జట్టు భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందనే నిజాన్ని ఇక్కడ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. భారత్తో సిరీస్ కంటే ముందు ఆ జట్టు శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్ల సిరీస్ ఆడింది. స్పిన్ కండిషన్స్లో విఫలమై వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది.
ఆ సిరీస్లో ఓడినా.. స్పిన్ కండిషన్స్కు కివీస్ బాగా అలవాటు పడింది. అందుకు తగ్గట్లుగా ఆడి భారత్ను ఓడించింది. అంతే తప్పా గంభీర్పై కోపంతో టీమిండియా ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా ఓటమికి అంగీకరించలేదు. మరోవైపు గత కొంత కాలంగా భారత బ్యాటర్లు స్పిన్కు తడబడుతున్నారు. గణంకాలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. సిరీస్ ఓటమికి ఆటగాళ్లతో పాటు గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా ఓ కారణమే.