టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తనను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకోవాలని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కోరినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గత బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతోనే ఫైనల్కు దూసుకెళ్లింది. ఆసియా కప్ టోర్నీకి సునీల్ గవాస్కర్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్.. హార్దిక్ పాండ్యా సుదీర్ఘంగా మాట్లాడాడు. ఈ సంభాషణ గురించి అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ హోస్ట్ ప్రశ్నించాడు.

హార్దిక్ పాండ్యాతో ఏం మాట్లాడారని వివరణ కోరాడు. ఇందుకు సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో సమాధానమిచ్చి నవ్వులు పూయించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెప్ అయిన హార్దిక్ పాండ్యాను ఐపీఎల్లో తనను పరిగణలోకి తీసుకోవాలని కోరానని చెప్పాడు. దాంతో హోస్ట్ పగలబడి నవ్వాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఎటకారంలో గవాస్కర్ను మించినోడు లేడని కామెంట్ చేస్తున్నారు.
తన కెరీర్లో 125 టెస్ట్లు ఆడిన గవాస్కర్ 10122 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. 108 వన్డేల్లో 3092 పరుగులతో రాణించాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సునీల్ గవాస్కర్ ఒక సభ్యుడు. అతని సారథ్యంలో టీమిండియా వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచింది.
మరోవైపు ముంబై ఇండియన్స్తోనే తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన హార్దిక్ పాండ్యా 2021 వరకు ఆ జట్టుకే ఆడాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అతను గుజరాత్ టైటాన్స్కు వెళ్లి ఆ జట్టు సారథ్యం బాధ్యతలు చేపట్టాడు. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా.. ఆ మరుసటి ఏడాది రన్నరప్ టైటిల్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే ఐపీఎల్ 2020 నుంచి ముంబై ఇండియన్స్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు.