ఇంగ్లండ్ గడ్డపై చారిత్రాత్మక విజయాన్నందుకున్న శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియాకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ క్షమాపణలు చెప్పారు. భారత చిరస్మరణీయ విజయాన్ని కొనియాడిన శశి థరూర్.. గిల్ సేనను తక్కువ అంచనా వేసినందుకు క్షమించాలని కోరాడు. ఇంగ్లండ్తో సోమవారం ముగిసిన ఆఖరి టెస్ట్లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో పడిలేచిన టీమిండియా .. మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్తో గెలుపొందింది.
374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు సాధించింది. 374 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులే అవసరమయ్యాయి.
అప్పటికే హ్యారీ బ్రూక్(98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 111), జోరూట్(152 బంతుల్లో 12 ఫోర్లతో 105) శతకాలతో చెలరేగారు. క్రీజులో డేంజరస్ బ్యాటర్ జెమీ స్మిత్ ఉండటం.. జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో ఇంగ్లండ్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు.

శశి థరూర్ సైతం భారత ఓటమి తప్పదని భావించి, విరాట్ కోహ్లీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ట్వీట్ చేశారు. ఈ దేశానికి కోహ్లీ అవసరం ఉందని, రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని కోరాడు. 'ఈ సిరీస్లో కొన్నిసార్లు విరాట్ కోహ్లీ లేని లోటు నాకు స్పష్టంగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో అతన్ని నేను చాలా మిస్సయ్యాను. అతని పట్టుదల, దూకుడు, మైదానంలో సహచర ఆటగాళ్లను ఉత్సాహపరిచే అతని విధానం, అతని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ సిరీస్లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని అతన్ని కోరడం ఇప్పటికే ఆలస్యమైందనుకుంటా..? విరాట్.. ఈ దేశానికి నువ్వు కావాలి.'అని శశి థరూర్ ట్వీట్ చేశారు.
ఆఖరి రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్తో జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్లను పెవిలియన్ చేర్చి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. దాంతో శశి థరూర్ భారత జట్టుకు క్షమాపణలు చెప్పాడు. 'మాటలు రావడం లేదు. ఏం విజయం ఇది. ఇంగ్లండ్తో సిరీస్ను టీమిండియా సమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జట్టు చూపిన తెగువ, పట్టుదల, కసి అద్భుతం. ఈ జట్టు ప్రత్యేకమైనది. టీమిండియా విజయంపై నేను సందేహం వ్యక్తం చేసినందుకు క్షమించండి. సిరాజ్ మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. విజయం సాధించిన హీరోలకు సెల్యూట్'అని శశి థరూర్ ట్వీట్ చేశారు.