టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ మరో ప్రపంచకప్ అందించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కర్జాత్-జామ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ క్రికెట్ అకాడమీ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిత్ శర్మ హాజరయ్యాడు.
ఈ సందర్భంగా రోహిత్ పవార్ మాట్లాడుతూ.. 2027 ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగి మరో టైటిల్ అందించాలన్నారు. 'మాకు మరో ప్రపంచకప్ కావాలి. 2027 ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మను కెప్టెన్గా కొనసాగించాలి'అని రోహిత్ పవార్ అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. రోహిత్ శర్మ నినాదాలతో క్రికెట్ అకాడమీ మారుమోగిపోయింది.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ గెలవడం తమ లక్ష్యమని, అది సాధించామని చెప్పుకొచ్చాడు. 'ఇటీవలే టీమిండియా అతిపెద్ద లక్ష్యమైన టీ20 ప్రపంచకప్ సాధించాం. ప్రపంచకప్ గెలవడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే నేను ఇక్కడికి వేరే కారణంతో వచ్చాను.
అందరూ ఇష్టపడే ఆట క్రికెట్. ఇక్కడ మేం క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాం. తదుపరి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా ఇక్కడి నుంచే వస్తారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మళ్లీ ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తాను.'అని అభిమానులను ఉద్దేశించి రోహిత్ మరాఠీలో మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఫలితం తేలదనుకున్న కాన్పూర్ టెస్ట్లో రోహిత్ తన దూకుడైన సారథ్యంతో విజయాన్ని అందించాడు. బజ్బాల్ను మించిన గమ్బాల్తో బంగ్లాదేశ్ను మట్టికరిపించాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
దాంతోనే అతను ఇంటికి తిరిగి వచ్చాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ ఇండియా.. బంగ్లాదేశ్తో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ ఆడనుంది.