టీమిండియా వెటరన్ బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ను సెలెక్టర్లు పట్టించుకోకపోవడంపై రాజకీయంగా దుమారం రేగింది. దేశంలోని రెండు ప్రధాన పార్టీలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరగనున్న రెండు అనధికార టెస్ట్లకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ భారత్-ఏ జట్టును మంగళవారం ప్రకటించింది. గాయంతో భారత జట్టుకు దూరమైన రిషభ్ పంత్ ఈ అనధికార టెస్ట్ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. అతన్నే సారథిగా ఎంపిక చేశారు. సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ అనధికార టెస్ట్ల్లో రాణించే ఆటగాళ్లకు సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో అవకాశం దక్కనుంది.
ఇక భారత్-ఏ జట్టులోనే చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్కు భారత ప్రధాన జట్టులో కూడా చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి 17 కిలోల బరువు తగ్గినా.. రెడ్ బాల్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా పట్టించుకోకపోవడం అందర్నీఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత షామ మొహమ్మద్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారానికి కారణమైంది. ఇంటి పేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం రావడం లేదా? అని ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

'ఇంటి పేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా? ఊరికే అడుతున్నా అంతే.. ఈ విషయంలో గౌతమ్ గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా'అని ట్వీట్ చేసింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం దక్కడం లేదని పరోక్షంగా ఆరోపించింది. ఈ ట్వీట్పై క్రికెట్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని, ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడవద్దని హితవు పలుకుతున్నారు.
మరోవైపు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా సర్ఫరాజ్ ఖాన్ను ఎందుకు ఎంపిక చేయలేదని సోషల్ మీడియా వేదికగా సెలెక్టర్లను నిలదీసాడు.స్ట్ క్లాస్ క్రికెట్లో అత్యద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ.. అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై ఒవైసీ ప్రశ్నలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.
ముంబైకి చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అతను 65 ప్లస్ సగటుతో పరుగులు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 6 టెస్ట్ మ్యాచ్లు ఆడి 37 సగటుతో 371 పరుగులు చేశాడు. న్యూజిలాండ్పై బెంగళూరు టెస్టులో 150 పరుగులు కూడా చేశాడు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టులో ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఏ తరఫున 92 పరుగులతో రాణించాడు. అయినా అతనికి భారత జట్టులో అవకాశం దక్కలేదు.