న్యూఢిల్లీ: దేశంలోని సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయి. దేశంలో జరిగే ప్రతీ విషయాన్ని రాజకీయాలకు ముడిపెడుతూ విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవ్వడంపై సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ సెటైర్స్ పేలుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే టీమిండియా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిందని ఆ పార్టీ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా 9 ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓటమిపాలైందని గుర్తు చేస్తున్నారు.

2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈ సమయంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిచిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
2014లో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక టీమిండియా 9 ఐసీసీ టోర్నీల్లో విఫలమైందని విమర్శిస్తున్నారు. ఎన్డీఏ హయాంలో టీమిండియా ఆడిన తొలి ఐసీసీ టోర్నీ 2014 టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిందని, ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిందని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమిపాలైందని, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో చిత్తయ్యిందని విమర్శిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఓడిన టీమిండియా.. 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిందని ఎద్దేవా చేస్తున్నారు. 2021, 2022 టీ20 ప్రపంచకప్లోనూ టీమిండియాకు ఓటమే ఎదురైందని విమర్శిస్తున్నారు.
ఎన్డీఏ అధికారంలో ఉన్న 2003 వన్డే ప్రపంచకప్లోనూ టీమిండియాకు ఓటమే ఎదురైందని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీమిండియా ఐసీసీ టైటిల్ సాధిస్తుందని సవాల్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మద్దతుదారులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ఆటకు రాజకీయాలతో ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు.