మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీ పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఆ జట్టు దారుణంగా విఫలమవుతోంది. పురుషులైనా.. మహిళలైనా పాకిస్థాన్ ఫీల్డింగ్ అనగానే వార్ని సిగ్నేచర్ విన్యాసాలు మదిలో మెదులుతాయి. ఒక క్యాచ్ కోసం ఇద్దరు ఆటగాళ్లు ఢీ కొట్టుకోవడం.. బంతిని బౌండరీ లైన్లోకి తన్నడం.. ఇద్దరు ప్లేయర్లు కలిసి క్యాచ్ వదిలేయడం వంటి ఫీల్డింగ్ విన్యాసాలకు పాకిస్థాన్ పెట్టింది పేరు.
తాజాగా భారత్తో ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లోనూ ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. భారత హిట్టర్ రిచా ఘోష్ ఇచ్చిన ఓ సునాయస క్యాచ్ను పాకిస్థాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్, నటాలియ పర్వాయిజ్ నేలపాలు చేశారు. డయానా బైగ్ వేసిన ఆఖరి ఓవర్ మూడో బంతిని రిచా ఘోష్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ మిస్టైమ్ అయిన బంతి గాల్లోకి లేవగా.. వికెట్ కీపర్ డయానా బైగ్ నా క్యాచ్ అని అరుస్తూ పరుగెత్తింది.

మరోవైపు బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న నటాలియ పర్వాయిజ్ కూడా ఈ క్యాచ్ కోసం ప్రయత్నించింది. అయితే ఈ ఇద్దరూ ఢీ కొట్టుకొని క్యాచ్ను నేలపాలు చేశారు. అదృష్టవశాత్తు ఇద్దరికి పెద్ద గాయాలు కాలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాకిస్థాన్ ఫీల్డింగ్పై నెటిజన్లు సిగ్నేచర్ ఫీల్డింగ్ అంటూ సెటైర్లు పేల్చారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. ప్రతికా రావల్(31), హర్లీన్ డియోల్(46), జెమీమా రోడ్రిగ్స్(32), రిచా ఘోష్(35 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్మృతి మంధాన(23), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(19) తీవ్రంగా నిరాశపర్చారు. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బైగ్(4/69) నాలుగు వికెట్లు తీయగా.. సదియా ఇక్బాల్, ఫాతిమా సనా రెండేసి వికెట్లు పడగొట్టారు. రమీన్ షమీమ్, నష్రా సంధు చెరో వికెట్ తీసారు.
అనంతరం పాకిస్థాన్ 159 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిద్రా అమిన్(81) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్(3/20), దీప్తి శర్మ(3/45) మూడేసి వికెట్లు తీయగా.. స్నేహ్ రాణా(2/38) రెండు వికెట్లు పడగొట్టింది.